యాప్నగరం

అవి డమ్మీ వీవీప్యాట్ స్లిప్పులు.. ఉపయోగం లేదు: ద్వివేది

ఆత్మకూరులో బయటపడ్డ వీవీప్యాట్ స్లిప్పులు పోలింగ్ రోజువి కాదని చెప్పిన ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది. అవి డమ్మీవని.. వాటి వల్ల ఎలాంటి ఉపయోగం లేదని వివరణ..

Samayam Telugu 15 Apr 2019, 9:42 pm
నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని పాఠశాల ఆవరణలో వీవీప్యాట్‌ స్లిప్పులు కలకలం రేపిన ఘటనపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పందించారు. బయటపడిన స్లిప్పులు పోలింగ్‌ రోజువి కాదని తెలిపారు. ఆత్మకూరు ప్రభుత్వ పాఠశాల ఈవీఎంల కమీషనింగ్‌ సెంటర్‌ మాత్రమేనని వెల్లడించారు. పోలింగ్‌కు ముందు 1000 ఓట్లను బెల్‌ ఇంజినీర్లు పోల్‌ చేసి చూశారని.. ఈవీఎంల పని తీరును పరిశీలించారని ఆయన వివరించారు. సరిగా పనిచేస్తున్నాయని నిర్ధరించుకున్న తర్వాతే ఈవీఎంలను పోలింగ్ కేంద్రాలకు తరలించారని తెలిపారు.

అయితే.. ఎవరో ఉద్యోగి కావాలనే ఆ స్లిప్పులను ఆరుబయట పడేసినట్లున్నారని ద్వివేది అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఆత్మకూరు ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ప్రతి నియోజకవర్గం పరిధిలో జరిగే తప్పులకు ఆర్వోలే బాధ్యులవుతారని హెచ్చరించారు.

నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ పాఠశాల ఆవరణలో సోమవారం (ఏప్రిల్ 15) బయటపడ్డ వీవీప్యాట్ స్లిప్పులు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపాయి. 200లకు పైగా స్లిప్పులు బయటపడ్డాయి. స్లిప్పులను చూసిన విద్యార్థులు, టీచర్లకు సమాచారం ఇవ్వడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న ఆర్డీవో తనిఖీ చేశారు.

పాఠశాల ఆవరణలో బయటపడ్డవి మాక్ పోలింగ్ నిర్వహించిన తర్వాత పడేసిన స్లిప్పులని ఆత్మకూరు ఆర్డీవో చిన్న రాముడు తెలిపారు. పాఠశాల ఆవరణలోనే వాటిని కాల్చివేసినట్లు వెల్లడించారు. వాటివల్ల ఎలాంటి ఉపయోగం లేదని ఆర్డీవో చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.