యాప్నగరం

జగన్ సభలో అపశృతి.. గోడ కూలి 10 మందికి గాయాలు

జగన్ సభలో అపశృతి చోటుచేసుకుంది. గోడ కూలి పలువురు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. విజయనగరం జిల్లా డెంకాడ సభలో ఈ విషాదం జరిగింది.

Samayam Telugu 17 Mar 2019, 9:00 pm
వైసీపీ ఎన్నికల ప్రచార సభలో అపశృతి చోటుచేసుకుంది. ఆదివారం (మార్చి 17) సాయంత్రం విజయనగరం జిల్లా డెంకాడలో ప్రచార రథం పైనుంచి జగన్‌ ప్రసంగిస్తుండగా.. ఆ సమీపంలో భవనం పైనుంచి ఇటుకలు పడి 10 మంది వరకు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Samayam Telugu denkada


వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. జగన్‌ను చూసేందుకు చుట్టుపక్కల ఉన్న భవనాల పైకి జనం భారీగా చేరుకున్నారు. ఈ సమయంలో ఓ భవనం పిట్ట గోడ కూలడంతో సుమారు 20 అడుగుల ఎత్తు నుంచి.. కింద ఉన్నవారిపై ఇటుకలు పడినట్లు తెలుస్తోంది. భవనం పైనుంచి మనుషులు కింద పడితే ప్రాణాలకు ప్రమాదం ఏర్పడి ఉండేది.

వెంటనే స్పందించిన స్థానికులు, పోలీసులు బాధితులను ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో నలుగురికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. బాధితుల్లో ఓ మహిళ కూడా ఉన్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.