యాప్నగరం

జిత్తులమారి నక్కతో యుద్ధం.. అన్నొస్తున్నాడని చెప్పండి: జగన్

ఎన్నికల కురుక్షేత్రంలో ప్రజలందరి తోడు, ఆశీస్సులు కావాలని వైసీసీ అధినేత జగన్ కోరారు. నర్సీపట్నం నుంచి ఎన్నికల ప్రచార భేరీ మోగించారు. చంద్రబాబు పాలనపై నిప్పులు చెరిగారు.

Samayam Telugu 17 Mar 2019, 5:13 pm
ప్రస్తుతం ఏపీలో ఎన్నికలు కేవలం రెండు పార్టీల మధ్యే జరగడం లేదని జగన్ అన్నారు. ధర్మం – అధర్మం, విశ్వసనీయత – వంచన మధ్య ఎన్నికలు జరుగుతున్నాయన్న జగన్.. ఈ కురుక్షేత్రంలో అందరి తోడు, ఆశీస్సులు, దీవెనలు కావాలని కోరారు. విశాఖ జిల్లా నర్సీపట్నం వేదికగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్.. ఎన్నికల ప్రచారాన్ని ఘనంగా ప్రారంభించారు. చంద్రబాబు నాయుడు పాలనపై నిప్పులు చెరిగారు.
Samayam Telugu ys jagan


‘చంద్రబాబు ఎండమావులను నమ్మొద్దు.. రేప్పొద్దున అన్న సీఎం కాగానే నవరత్నాలు పథకాల ద్వారా మనందరి జీవితాలు బాగు పడతాయని చెప్పి అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి’ అని వైసీపీ కార్యకర్తలకు జగన్ పిలుపునిచ్చారు.

‘ఈ ఎన్నిక‌ల్లో ఒక జిత్తుల మారి న‌క్కతో యుద్ధం చేస్తున్నాం. మోసాలు చేసే చంద్రబాబుతో త‌ల‌ప‌డుతున్నాం. ఎన్నిక‌ల‌ను సమయంలో ఆయ‌న గ్రామాల‌కు డ‌బ్బుల మూట‌లు పంపిస్తారు. అనేక ప్రలోభాలు పెడ‌తారు. ప్రతి ఓట‌రుకు రూ. 3 వేలు ఇచ్చేందుకు ముందుకొస్తారు. ఆయన ఇచ్చే డ‌బ్బుకు మోస పోవ‌ద్దు. ప్రతి కుటుంబానికి తెలియజెప్పండి.. రానున్నది వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం..’ అని జగన్ అన్నారు.

చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో శాంతి భ‌ద్రత‌లు లోపించాయని జగన్ మండిపడ్డారు. ‘మా చిన్నాన్నను ఇంట్లోనే గొడ్డలితో న‌రికి చంపారు. టీడీపీ ఎమ్మెల్యే ఓ మ‌హిళా ఎంఎఆర్‌వోను జుట్టు ప‌ట్టుకుని లాగినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోరు. మన ప్రభుత్వంలో ఇలాంటివి జరగవు. శాంతి భ‌ద్రతలకు ప్రాధాన్యమిస్తాం. అవినీతిమ‌య‌మైన జ‌న్మభూమి క‌మిటీల‌ను ఎత్తి వేస్తాం’ అని జగన్ అన్నారు.

‘రాష్ట్రంలో అవ్వా తాతల దగ్గరకు వెళ్లండి. మీకు ఎంత పింఛను వస్తుందని అడగండి. చాలా మంది తమకు పింఛను రావడం లేదని చెబుతారు. కొందరు తమకు రూ.2 వేలు ఇస్తున్నారని చెప్తారు. అప్పుడు అడగండి.. ఎన్నికలు మూడు నెలల్లో ఉన్నాయి కాబట్టే, అది కూడా అన్న చెప్పాడు కాబట్టి ఇస్తున్నాడని చెప్పండి. అన్నకు భయపడి మాత్రమే చంద్రబాబు ఆ పింఛను ఇస్తున్నాడని వివరించండి. అన్న సీఎం కాగానే ఆ పింఛన్‌ను క్రమంగా పెంచి రూ.3 వేలు చేస్తారని వివరించండి’ అని కార్యకర్తలను వైఎస్‌ జగన్‌ కోరారు.

Also Read: నేను విన్నాను, నేను ఉన్నాను.. ‘యాత్ర’ స్టైల్లో జగన్ ఎంట్రీ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.