యాప్నగరం

Janasena: పాలిటిక్స్‌లోనూ పవన్ ట్రెండ్ చేస్తారా? రెండు చోట్లా గెలుస్తారా?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరం అసెంబ్లీ స్థానాలకు పోటీ చేశారు. 2019 ఏపీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేసిన ఏకైక నేత ఆయనే కావడం విశేషం.

Samayam Telugu 22 May 2019, 9:17 pm
అందరూ ట్రెండ్ ఫాలో అయితే.. నేను ట్రెండ్ సెట్ చేస్తానని చెప్పే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. రాజకీయాల్లోనూ తనదైన స్టయిల్ ఫాలో అయ్యారు. ఏపీ ఎన్నికల్లో మిగతా నేతలంతా ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేయగా.. పవన్ కళ్యాణ్ మాత్రం రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. విశాఖపట్నం జిల్లాలోని గాజువాక నుంచి, పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం నుంచి జనసేనాని ఎన్నికల బరిలో నిలిచారు. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగిన ఆయన అన్నయ్య చిరంజీవిని ఫాలో అయ్యారు.
Samayam Telugu pk jsp


పవన్ కళ్యాణ్ పార్టీ కింగ్ మేకర్ అవుతుందని ఎన్నికల ముందు అంతా భావించారు. కానీ ఎగ్జిట్ పోల్స్ మాత్రం అందుకు విరుద్ధంగా అంచనాలను వెలువరించాయి. లగడపాటి మాత్రం పవన్ గెలుస్తాడని, జనసేనకు 11 శాతానికి అటు ఇటుగా ఓట్లు పడ్డాయని తెలిపారు. పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగుపెడతారని లగడపాటి చెప్పినప్పటికీ.. ఆయన రెండు చోట్ల నుంచి గెలుస్తారా? లేదా ఒక్కస్థానం నుంచి గెలుస్తారా? అనే విషయమై ఆయన క్లారిటీ ఇవ్వలేదు. గాజువాకలో జనసేనకు లక్షకు పైగా సభ్యత్వాలు ఉండటంతో అక్కడ పవన్ గెలుపు నల్లేరు మీద నడకేనని భావించారు. కానీ అక్కడ వైఎస్ఆర్సీపీ గట్టి పోటీ ఇచ్చిందని, ఆ పార్టీనే గెలిచే అవకాశం ఉందనే వార్తలొచ్చాయి.

గాజువాకలో టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస రావు, వైఎస్ఆర్సీపీ నుంచి తిప్పల నాగిరెడ్డి పోటీ చేశారు. గత ఎన్నికల్లోనూ వీరిద్దరే బరిలో దిగగా.. పల్లా 21 వేల మెజార్టీతో గెలుపొందారు.

భీమవరంలో పవన్ కళ్యాణ్‌తోపాటు టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు, వైఎస్ఆర్సీపీ నుంచి గ్రంథి శ్రీనివాస్ బరిలో దిగారు.

పవన్‌ రాజకీయ ప్రస్థానం పీఆర్పీతో ప్రారంభం..
జనసేన రాజకీయ ప్రస్థానం 2014 మార్చి 14న ప్రారంభమైంది. కానీ అంతకు ఐదేళ్ల ముందే ప్రజారాజ్యంతోనే.. పవన్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. పీఆర్పీ తరఫున పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజారాజ్యం యువ విభాగమైన ‘యువ రాజ్యం’ అధ్యక్ష బాధ్యతలను ఆయన నిర్వర్తించారు. పీఆర్పీ ఎంట్రీతో 2009 ఎన్నికల్లో త్రిముఖ పోరు నెలకొంది. ఆ ఎన్నికల్లో చిరంజీవి పార్టీ ఆశించిన స్థాయిలో సీట్లు రాబట్టలేకపోయింది. కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంక్ చీలడంతో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చింది. అనంతర పరిణామాలతో పీఆర్పీ కాంగ్రెస్‌లో విలీనమైంది.

పీఆర్పీ కాంగ్రెస్‌లో విలీనం కావడంతో జనసేన ప్రజారాజ్యం-2 అని, పవన్ ప్యాకేజీ స్టార్ అనే విమర్శలొచ్చాయి. కానీ పవన్ మాత్రం తన తుది శ్వాస వరకు జనసేన కోసం పని చేస్తానని క్లారిటీ ఇచ్చారు. అధికారం కోసం పోటీ చేయడం లేదు మార్పు కోసం ఎన్నికల బరిలో దిగుతున్నామన్న పవన్.. ఒక్క స్థానంలో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టిన తమ గళం వినిపిస్తామన్నారు. ఒక్క చోట కూడా గెలవకపోయినా.. అసెంబ్లీ ముందు కూర్చొనైనా జనం తరఫున పోరాడతానన్నారు. ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా ఏపీ ప్రత్యేక హోదా సాధించడమే ప్రధానాంశంగా జనసేనాని పోరాటం సాగించే అవకాశం ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.