యాప్నగరం

Vizag North: గంటా శ్రీనివాసరావు.. జంపింగుల్లోనూ గెలుపే!

మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖపట్నం నార్త్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. సమీప వైసీపీ అభ్యర్థి కె.కె.రాజుపై గంటా విజయం సాధించారు.

Samayam Telugu 23 May 2019, 7:23 pm
గంటా శ్రీనివాసరావు.. ఏ పార్టీ నుంచి పోటీ చేసినా, ఏ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగినా గెలుపు మాత్రం ఖాయం. ఆయన రాజకీయ ప్రయాణాన్ని పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఒక్కసారి పోటీచేసిన నియోజకవర్గంలో మళ్లీ పోటీచేయని నాయకుడు గంటా. ఎన్నికలొచ్చిన ప్రతిసారి ఓ కొత్త నియోజకవర్గానికి వెళ్లి అక్కడ ఓటర్లను తనవైపు తిప్పుకొని గెలవడమంటే మామూలు విషయం కాదు. అలాంటిది, తాను బరిలోకి దిగితే ఎలాంటి ప్రత్యర్థులైనా బలాదూర్ అంటూ విజయం కేతనం ఎగరవేశారు గంటా. ఒకసారి ఎంపీ, ఆ వెంటనే మూడు సార్లు వరసగా ఎమ్మెల్యేగా వేర్వేరు నియోజకవర్గాల నుంచి గెలవడమంటే మాటలతో పనికాదు. కానీ, గంటా గెలిచి చూపించారు. ఈసారి కూడా మళ్లీ నియోజకవర్గాన్ని మార్చుకుని విశాఖ ఉత్తరంలో పోటీకి దిగిన గంటా తన విజయ పరంపరను కొనసాగించారు.
Samayam Telugu Ganta_Srinivasa_Rao


ప్రకాశం జిల్లా జరుగుమిల్లి మండలం కామేపల్లి గ్రామానికి చెందిన గంటా శ్రీనివాసరావు.. విశాఖలో స్థిరపడ్డారు. డిగ్రీ పూర్తిచేసి స్థిరాస్తి వ్యాపారంలోకి అడుగుపెట్టారు. వ్యాపారవేత్తగా ఎదిగారు. 1999లో టీడీపీలో చేరి అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేశారు. కాంగ్రెస్ అభ్యర్థి గుడివాడ గుర్నాథరావుపై 58,464 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఆ తరవాత 2004 అసెంబ్లీ ఎన్నికల్లో చోడవరం నుంచి పోటీ చేసి సీనియర్ కాంగ్రెస్ లీడర్ బాలిరెడ్డి సత్యారావుపై 9601 ఓట్ల తేడాతో విజయ కేతనం ఎగరవేశారు. అయితే, 2004లో టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది.

ఆ తరవాత 2009 ఎన్నికల సమయంలో సినీ నటుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరిన గంటా.. అనకాపల్లి శాసనసభ స్థానం నుంచి పోటీ చేశారు. ఉద్దండులైన కొణతాల రామకృష్ణ, దాడి వీరభద్రరావులను ఓడించి వరసగా రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు. 10,866 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అయితే, ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్‌లో గంటాకి మంత్రి పదవి దక్కింది. రాష్ట్ర విభజన తరవాత గంటా గుండ్రంగా తిరిగి మళ్లీ టీడీపీలో చేరారు. భీమిలి నుంచి పోటీచేసి వైసీపీ అభ్యర్థి కర్రి సీతారాంపై 37,226 ఓట్ల మెజారిటీతో గెలిచారు. చంద్రబాబు క్యాబినెట్‌లో మానవవనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

2014 ఎన్నికల్లో భీమిలి నుంచి మంచి మెజారిటీతో గెలిచినా మళ్లీ ఈ ఎన్నికల్లో గంటా తన నియోజకవర్గాన్ని మార్చేశారు. ఈసారి విశాఖపట్నం ఉత్తరం నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే, గంటా అంత సులభంగా ఏమీ గెలవలేదు. వైసీపీకి చెందిన ప్రత్యర్థి కె.కె.రాజు.. గంటాకు గట్టి పోటీనే ఇచ్చారు. ఆఖరి రౌండ్ వరకు ఉత్కంఠగా సాగిన లెక్కింపులో చివరికి విజయం గంటానే వరించింది. దీంతో వరుసగా వేర్వేరు నియోజకవర్గాల నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గంటా ఎన్నికైనట్టయింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.