యాప్నగరం

మావోల బెదిరింపుల మధ్య ఛత్తీస్‌గఢ్ పోలింగ్.. 70% ఓటింగ్

బెదిరింపులను లెక్కచేయకుండా ఛత్తీస్‌గఢ్ ప్రజలు ఓటింగ్‌కు పోటెత్తారు. సీఎం సహా పలువురి మంత్రుల భవితవ్యం తేలనుంది.

Samayam Telugu 12 Nov 2018, 8:22 pm
మావోయిస్టుల బెదిరింపులు, మందుపాతర పేలుళ్లు, ఎన్‌కౌంటర్, చెదురుమదురు ఘటనల మధ్య ఛత్తీస్‌గఢ్‌లో తొలి దశ పోలింగ్ ముగిసింది. 18 నియోజకవర్గాల్లో జరిగిన ఓటింగ్‌లో మొత్తం 70 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఆ రాష్ట్ర ఎన్నికల అధికారి ఉమేష్‌ సిన్హా వెల్లడించారు. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు ఎలాంటి బెదిరింపులకు భయపడకుండా ధైర్యంగా ఓటు హక్కు వినియోగించుకోవడం గమనార్హం.
Samayam Telugu garh


ఎవరి వేళ్ల మీదైనా ఓటు వేసిన సిరా గుర్తు కనిపిస్తే వారి వేళ్లు నరికేస్తామంటూ నక్సల్స్‌ హెచ్చరికలు చేసినట్లు కొంత మంది గ్రామస్థులు తెలిపారు. పోలింగ్‌ను బహిష్కరిస్తూ పలు ప్రాంతాల్లో మావోయిస్టుల పేరుతో లేఖలు, పోస్టర్లు వెలిశాయి. పోలింగ్‌ ప్రారంభం కావడానికి కొద్ది గంటల ముందే మావోయిస్టులు బాంబు దాడికి దిగారు. అయితే.. ఓటర్లను ఇవేవీ ఆపలేకపోయాయి.

2013 నవంబరులో ఛత్తీస్‌గఢ్ తొలి దశ ఎన్నికల్లో 75.53% పోలింగ్‌ నమోదవగా.. ఈ సారి 70% పోలింగ్ జరిగింది. మొత్తం 4336 పోలింగ్‌ కేంద్రాలకుగాను 58 చోట్ల సాంకేతిక కారణాల వల్ల పోలింగ్‌ ఆలస్యమైంది. ఎన్నికల వేళ జరిగిన ఘటనల్లో ఐదుగురు మావోయిస్టులు మరణించగా.. ఇద్దరు కోబ్రా జవాన్లు గాయపడ్డారు.

దంతేవాడ జిల్లాలోని తుమక్‌పాల్‌-నయనార్‌ రోడ్డుపై ఉదయం 5.30 గంటల ప్రాంతంలో నక్సల్స్‌ ఐఈడీని పేల్చేశారు. పోలింగ్‌ విధుల నిమిత్తం వెళ్తున్న భద్రతా సిబ్బంది, ఎన్నికల అధికారులను లక్ష్యంగా చేసుకొని మావోలు ఈ దాడికి తెగబడ్డారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీలో మొత్తం 90 స్థానాలుండగా.. తొలి దశలో భాగంగా 18 స్థానాలకు సోమవారం (నవంబర్ 12) ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో 190 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. సీఎం రమణ్‌సింగ్‌, మంత్రులు కేదార్‌ కశ్యప్‌, మహేశ్‌ గగ్దా, ఎంపీ విక్రమ్‌ ఉసెందీ ఈ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మిగిలిన 72 స్థానాలకు నవంబర్ 20న పోలింగ్‌ నిర్వహించనున్నారు. డిసెంబరు 11న ఫలితాలు వెలువడతాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.