యాప్నగరం

కేజ్రీవాల్‌పై పోటీగా జాతీయస్థాయి హాకీ ప్లేయర్, క్యాబ్ డ్రైవర్లు

Delhi Elections 2020కి జనవరి 21తో నామినేషన్ దాఖలు గడువు ముగిసింది. ఈ ఎన్నికల్లో విజయం కోసం అన్ని రాజకీయ పార్టీలూ సర్వశక్తులనూ ఒడ్డుతున్నాయి.

Samayam Telugu 22 Jan 2020, 3:30 pm
ఢిల్లీ శాసనసభ ఎన్నికలకు ఫిబ్రవరి 8న పోలింగ్ జరగనుండగా, నామినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఆప్ అధ్యక్షుడు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నారు. గత ఎన్నికల్లోనూ కేజ్రీవాల్ ఇదే స్థానం నుంచి పోటీచేసి విజయం సాధించారు. ఇక్కడ ఆయనతోపాటు మరో 92 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మంగళవారం నామినేషన్ దాఖలుచేసిన కేజ్రీవాల్.. క్యూలైన్‌లో ఆరుగంటలు నిరీక్షించాల్సి వచ్చింది.
Samayam Telugu kejri


న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి మొత్తం 93 మంది నామినేషన్ వేయగా, వీరిలో ఐదుగురు క్యాబ్‌ డ్రైవర్లు, పది మంది డీటీసీ మాజీ ఉద్యోగులు, నలుగురు సామాజిక కార్యకర్తలు, జాతీయ స్థాయి హాకీ అథ్లెట్‌ కూడా ఉండటం విశేషం. శుక్రవారం నామినేషన్ల ఉపసంహరణకు చివరితేదీ కాగా, ఎందరు పోటీలో ఉంటారో ఆ రోజే తెలుస్తుంది.

కాంట్రాక్టు ఉద్యోగులందరికీ సమాన వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీఎంకి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టడతో తనను ఉద్యోగం నుంచి తొలగించారని, అందుకే రాజకీయంగా ఆయన్ను ఎదుర్కొనేందుకు తమకున్న అవకాశం ఇదేక్కొటేనని డీటీసీ మాజీ ఉద్యోగి మనోజ్‌ శర్మ వ్యాఖ్యానించాడు. పవన్ కుమార్ అనే క్యాబ్‌ డ్రైవర్‌ సైతం కేజ్రీకి ప్రత్యర్థిగా నామినేషన్‌ వేశాడు. ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే నామినేషన్‌ వేయడానికి కేజ్రీవాల్‌కు 45 నెంబరు టోకెన్‌ ఇవ్వగా పవన్‌కు 44 నెంబరు టోకెన్‌ వచ్చింది.

ట్యాక్సీ డ్రైవర్ల సమస్యల గురించి ప్రస్తుత ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని, ఆటోరిక్షా ధరలను సవరించారు. కానీ తమ కోసం ఎలాంటి పథకాలను తీసుకురాలేదని, డ్రైవర్లు ఎమ్మెల్యేలుగా మారాల్సిన సమయం వచ్చిందని పవన్‌ కుమార్‌ అన్నారు. ఇదే స్థానం నుంచి నామినేషన్ వేసిన జాతీయస్థాయి అథ్లెట్‌ శైలేంద్ర సింగ్‌.. అంజాన్‌ ఆద్మీ పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. కేజ్రీవాల్‌ కంటే మెరుగైన సిద్ధాంతాలతో పాలన అందించగల సామర్థ్యం తమకుందని నిరూపించేందుకు పోటికి దిగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

శైలేంద్ర సింగ్ పేరు 2009లో వార్తల్లోకి వచ్చింది. కదులుతోన్న బస్సుకు మంటలు అంటుకోగా అందులోని ప్రయాణికులను తన ప్రాణాలకు తెగించి శైలేంద్ర రక్షించారు. దీంతో ఆయన పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. నామినేషన్ సందర్భంగా ఆయన అనుచరులు పత్రికల్లో వచ్చిన అప్పటి క్లిప్పింగ్‌లను ప్రదర్శిస్తూ ర్యాలీగా వచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.