యాప్నగరం

పార్టీ పెట్టిన 10 నెలలకే ‘కింగ్’గా దుష్యంత్.. హర్యానా యువ సంచలనం వివరాలివే!

హర్యానా ఎన్నికల ఫలితాలు హంగ్ దిశగా సాగుతున్నాయి. దీంతో ప్రభుత్వ ఏర్పాటులో దుష్యంత్ చౌతాలా నాయకత్వంలోని జననాయక్ జనతా పార్టీ కీలకం కానుంది. ఈ నేపథ్యంలో దుష్యంత్ గురించి ఆసక్తికర విశేషాలు..

Samayam Telugu 24 Oct 2019, 1:53 pm
హర్యానా ఎన్నికల ఫలితాలు హంగ్ దిశగా సాగుతున్నాయి. ఈ తరుణంలో అందరి చూపు 31 ఏళ్ల దుష్యంత్ చౌతాలా వైపు మళ్లింది. బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీగా ఆధిక్యంలో నిలుస్తుండటంతో.. దుష్యంత్ నాయకత్వంలోని జననాయక్ జనతా పార్టీ ప్రభుత్వ ఏర్పాటులో కీలకమయ్యే అవకాశం ఉంది. 90 సీట్లు హర్యానా అసెంబ్లీకి హంగ్ తప్పదని తెలియడంతో.. కాంగ్రెస్ నేతలు ఇప్పటికే ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారు. అవసరమైతే పది స్థానాల్లో ముందంజలో ఉన్న దుష్యంత్‌కు సీఎం పదవిని సైతం ఆఫర్ చేయడానికి ఆ పార్టీ సిద్ధంగా ఉంది. మరోవైపు బీజేపీ కూడా ఆయనతో పొత్తుకోసం ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో దుష్యంత్ గురించి విశేషాలు మీకోసం..
Samayam Telugu dushyant-chautala-


దుష్యంత్ చౌతాలా.. ఓం ప్రకాశ్ చౌతాలా మనవడు. మాజీ ఉప ప్రధాని చౌధరీ దేవి లాల్ ముని మనవడు. 1988లో జన్మించిన దుష్యంత్.. 2014 ఎన్నికల్లో ఎంపీగా గెలిచి.. పిన్నవయస్కుడైన ఎంపీగా రికార్డు క్రియేట్ చేశారు. 2018 డిసెంబర్ 9న ఆయన్ను ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్‌ఎల్‌డీ) బహిష్కరించింది. ఆ పార్టీ అధినేతగా దుష్యంత్ చిన్నాన్న అభయ్ చౌతాలా ఉన్నారు.

ఐఎన్‌ఎల్‌డీ నుంచి బయటకొచ్చిన దుష్యంత్.. జననాయక్ జనతా పార్టీని (జేజేపీ) ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ఆరు లక్షల మంది ప్రజలు హాజరయ్యారు. 1986లో ఆయన ముత్తాత నిర్వహించిన సభ తర్వాత హర్యానాలో నిర్వహించిన సభకు ఈ స్థాయిలో జనం హాజరుకావడం ఇదే తొలిసారి. ముత్తాత పేరు స్ఫురించేలా పార్టీ పెట్టి.. ఆయనకు తనే సరైన వారసుణ్ని అనిపించుకున్నారు.

జింద్ ఉపఎన్నికలో బరిలో దిగిన జేజేపీ ప్రధాన పార్టీలను ఆశ్చర్యపరుస్తూ రెండోస్థానంలో నిలిచింది. దుష్యంత్‌పై ప్రశంసలు గుప్పించిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. ఆయన పార్టీకి మద్దతు ప్రకటించారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో జేజేపీ తరఫున పోటీ చేసిన దుష్యంత్.. బీజేపీకి చెందిన బ్రిజేంద్ర సింగ్ చేతిలో ఓడారు. కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్ తనయుడే బిజేంద్ర సింగ్.

హర్యానాలో జాట్‌లు 29 శాతం ఉంటారు. ఈ దఫా అసెంబ్లీ ఎన్నికలో వారు జేజేపీ‌కి మద్దతుగా నిలిచారు. అమెరికాలో చదువుకున్న చౌతాలా.. అరిజోనా అత్యున్నత పౌరపురస్కారం పొందిన తొలి భారతీయుడు కావడం విశేషం.

Read Also: మహారాష్ట్ర సీఎం పీఠం కోసం శివసేన పట్టు.. బీజేపీకి షాకిస్తుందా?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.