యాప్నగరం

అదృష్టాన్ని పరీక్షించుకోనున్న ఇద్దరు మంత్రులు!

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు మొత్తం ఐదు దశలలో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా డిసెంబర్ 16న నాలుగో దశ పోలింగ్ జరుగుతోంది.

Samayam Telugu 16 Dec 2019, 1:46 pm
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో సోమవారం (డిసెంబర్ 16న) నాలుగో విడత పోలింగ్ కొనసాగుతోంది. నేటి ఉదయం ప్రారంభమైన ఈ పోలింగ్‌లో 15 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొత్తం 221 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. నిర్ణీత సమయానికి పోలింగ్ కేంద్రానికి చేకున్న వారు సైతం ఓటు వేసేందుకు అనుమతిస్తామని ఎన్నికల అధికారులు తెలిపారు.
Samayam Telugu Jharkhand


జమునా, గిరిధ్, తుండి, బగోడర్, దుమ్రి నియోజకవర్గాల్లో భద్రతా కారణాల వల్ల మధ్యాహ్నం 3 గంటల వరకే పోలింగ్ నిర్వహిస్తున్నట్లు అధికారులు వివరించారు. కాగా, నేటి పోలింగ్‌లో మొత్తం 47,85,009 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. నాలుగో దశ పోలింగ్‌లో జార్ఖండ్ రెవెన్యూశాఖ మంత్రి అమర్ కుమార్ జౌరీ, కార్మికశాఖ మంత్రి రాజ్ పాలివార్ కీలక అభ్యర్థులుగా ఉన్నారు.

మరోవైపు జరియా స్థానంపై ప్రత్యేక ఆసక్తి ఏర్పడింది. ఓకే కుటుంబానికి చెందిన మహిళా అభ్యర్థులు బరిలోకి దిగడమే అందుకు కారణం. కాంగ్రెస్ నుంచి దివంగత నేత నీరజ్ సింగ్ భార్య పూర్ణిమ బరిలో నిలవగా.. బీజేపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే సంజీవ్ సింగ్ భార్య రజినీ సింగ్ గట్టి పోటీ ఇస్తారని ప్రచారం జరుగుతోంది.

ఇప్పటివరకూ మూడు విడతల్లో 50 స్థానాలకు పోలింగ్ జరిగింది. నేడు నాలుగో విడతలో భాగంగా 15 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. చివరిదైన అయిదో దశ పోలింగ్ డిసెంబర్ 20న 16 స్థానాలకు జరగనుంది. డిసెంబర్ 23న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.