యాప్నగరం

Karnataka Congress: టిట్ ఫర్ టాట్.. దూకుడు పెంచిన కాంగ్రెస్.. హస్తం గూటికి సవాడి

Karnataka Congress: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు పోలీంగ్ దగ్గరపడుతోంది. ఈ సమయంలో ప్రధాన పార్టీలు కీలక నేతలపై ఫోకస్ పెట్టాయి. ముఖ్యంగా చేరికలను ప్రోత్సహిస్తున్నాయి. ఈ విషయంలో.. ఇటు కాంగ్రెస్, ఇటు బీజేపీ దూకుడుగా ఉన్నాయి. ఇటీవల కాంగ్రెస్‌కు చెందిన కీలక నేతలను బీజేపీ చేరదీయగా.. తాజాగా కాంగ్రెస్ బీజేపీకి షాక్ ఇచ్చింది. బీజేపీకి చెందిన సీనియర్ నేతను పార్టీలోకి ఆహ్వానించింది. కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఈ విషయంలో సక్సెస్ అయ్యారు.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 14 Apr 2023, 9:35 pm

ప్రధానాంశాలు:

  • కర్ణాటకలో బీజేపీకి షాకిచ్చిన కాంగ్రెస్ పార్టీ
  • కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ సీనియర్ నేత సవాడి
  • అథని నియోజకవర్గం నుంచి బరిలోకి లక్ష్మణ్!
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Savadi joined the Congress
కాంగ్రెస్‌లో చేరిన సవాడి
Karnataka Congress: కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ లక్ష్మణ్ సవాడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అథని నియోజకవర్గం నుంచి తనకు బీజేపీ అవకాశం ఇవ్వకపోవడంతో.. ఆ పార్టీకి ఆయన రాజీనామా చేశారు. ఆ వెంటనే బెంగళూరులోని కేపీసీసీ కార్యాలయంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సూర్జేవాలా, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ సమక్షంలో లక్ష్మణ్ సవాడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. లక్ష్మణ సవాడి (Laxman Savadi) తోపాటు మాజీ మంత్రి శశికాంత్ అక్కప్ప నాయక్ తదితరులు కూడా బీజేపీని వీడి హస్తం గూటికి చేరారు.
శుక్రవారం.. బెంగళూరులోని బీజేపీ నేత బసవరాజ్ హొరట్టి ఇంటికి వెళ్లిన లక్ష్మణ్ సవాడి.. తన రాజీనామా లేఖను సమర్పించారు. అనంతరం కేపీసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్‌లో చేరిన అనంతరం సవాడి కీలక వ్యాఖ్యలు చేశారు. 'నేను స్వచ్ఛందంగా కాంగ్రెస్‌ పార్టీలో చేరాను. బీజేపీకి, శాసనమండలికి రాజీనామా చేశాను. బీజేపీని వీడిన వారిని మళ్లీ పార్టీలో చేర్చుకోబోమని అరుణ్ సింగ్ అన్నారు. నా నియోజకవర్గ ప్రజలు నన్ను ఆదరిస్తున్నారు. అథని నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి.. గెలిచి ఎమ్మెల్యే అవుతా' అని సవాడి స్పష్టం చేశారు.
'బీజేపీ ఎమ్మెల్సీ, మాజీ ఉప ముఖ్యమంత్రి, లింగాయత్ నాయకులలో ఒకరైన లక్ష్మణ సవాడికి కాంగ్రెస్ కుటుంబానికి స్వాగతం' అని రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా ట్వీట్ చేశారు. ఏప్రిల్ 12న బీజేపీ తమ అభ్యర్థులను ప్రకటించింది. అందులో అథని నియోజకవర్గం కూడా ఉంది. కానీ.. లక్ష్మణ్ సవాడి పేరు లేదు. దీంతో ఆయన బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే ఎమ్మెల్సీ పదవికి కూడా రాంరాం చెప్పారు. విధేయులైన కార్యకర్తలను గౌరవించని పార్టీలో ఉండి లాభం లేదు.. తాను పార్టీకి విధేయుడైన కార్యకర్తనని, పార్టీని తల్లిగా భావించానని అప్పుడు సవాడి భావోద్వేగానికి లోనయ్యారు.

ఆ తర్వాత ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్‌సింగ్‌ సూర్జేవాలా, శాసనసభాపక్ష నేత సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు శివకుమార్‌తో లక్ష్మణ్ సవాడి సంప్రదింపులు జరిపారు. అయన అనుచరులు కూడా బీజేపీకి రాజీనామా చేయాలని.. కాంగ్రెస్ పార్టీలో చేరాలని డిమాండ్ చేశారు. దీంతో ఆయన హస్తం గూటికి చేరారు. ఇటు కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా సవాడి రాకను ఆహ్వానించారు. సవాడి ఒకటే షరతు పెట్టారని.. ఆయనకు అథని టికెట్ ఇస్తున్నామని సిద్ధరామయ్య ప్రకటించారు. ఆయన కచ్చితంగా గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.