యాప్నగరం

MTB Nagaraj: మంత్రి చదివింది 9వ తరగతి.. ఆస్తులేమో రూ.1,609 కోట్లు.. !

ప్రధాని పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌లు తమ అభ్యర్థులను ఖరారు చేశాయి. దీంతో నామినేషన్ల ఘట్టానికి తెరలేచింది. అత్యంత కీలకమైన నామినేషన్ల పర్వం సోమవారం ఒక్కసారిగా ఊపొచ్చింది. అన్ని ప్రధాన పార్టీల కీలక నేతలు నామపత్రాల దాఖలు చేసి కదనరంగానికి కదిలారు. మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి చెన్నపట్టణ నుంచి, ఆయన కుమారుడు నిఖిల్‌ కుమారస్వామి రామనగర నుంచి బరిలోకి దిగారు. మాజీ మంత్రి ఎంటీబీ నాగరాజు హోసకోటే నుంచి బరిలో నిలుస్తున్నారు.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 18 Apr 2023, 1:07 pm

ప్రధానాంశాలు:

  • కర్ణాటకలో ఊపందుకున్న నామినేషన్ల ప్రక్రియ
  • మూడేళ్లలో రూ.390 కోట్లు పెరిగిన ఆస్తులు
  • 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన నాగరాజ్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu MTB Nagraj
కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దాదాపు తమ అభ్యర్థులను ఖరారు చేశాయి. మొత్తం 224 స్థానాలకు గానూ బీజేపీ 222, కాంగ్రెస్ 210 సీట్లకు అభ్యర్థులను ప్రకటించాయి. ఈ నేపథ్యంలో హోసకోటే స్థానం నుంచి మంత్రి ఎంటీబీ నాగరాజు సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందుకు కారణం ఆయన తమ పేరున రూ.1,609 కోట్ల ఆస్తులున్నట్టు ప్రకటించడమే. భార్య శాంతకుమారి పేరిట రూ.536 కోట్ల చరాస్తులు, రూ.1,073 కోట్ల స్థిరాస్తులు ఉండగా.. ఇద్దరికీ రూ.98.36 కోట్లు అప్పులు ఉన్నట్టు వెల్లడించారు.
వ్యాపారవేత్త అయిన ఎంటీబీ నాగరాజు.. 2018 కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీచేసి విజయం సాధించారు. ఆయన అప్పట్లో తమకు రూ.1,120 కోట్ల ఆస్తులు ప్రకటించారు. 14 నెలల తర్వాత జేడీఎస్‌- కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయి బీజేపీ అధికారం చేపట్టే క్రమంలో మూకుమ్మడిగా రాజీనామా చేసిన 17 మంది ఎమ్మెల్యేలలో ఈయన కూడా ఉన్నారు. బీజేపీలో చేరిన తర్వాత 2020 ఉప ఎన్నికల్లో పోటీచేసినప్పుడు రూ.1,220 కోట్ల ఆస్తులున్నట్లు అఫిడ్‌విట్‌లో పేర్కొన్నారు. అయితే, ఆ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి శరత్ బాచేగౌడ చేతిలో నాగరాజు ఓడిపోయారు. అనంతరం.. ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి, మంత్రివర్గంలోకి తీసుకున్నారు.

మొత్తంగా ఐదేళ్లలో ఎంటీబీ నాగరాజు ఆస్తుల విలువ రూ.500 కోట్లు, మూడేళ్లలో రూ.390 కోట్ల మేర పెరిగినట్టయ్యింది. తొమ్మిదో తరగతి వరకే చదువుకున్న ఎం.టి.బి.నాగరాజుకు స్థిరాస్తి వ్యాపారం, వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉన్నాయి. ఈ ఎన్నికల్లోనూ శరత్ బాచేగౌడతోనే నాగరాజు పోటీ పడుతున్నారు. 2020 ఉప-ఎన్నికల్లో గెలిచిన తర్వాత శరత్.. కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈసారి ఆయనకు కాంగ్రెస్ టిక్కెట్ కేటాయించింది. ఇక, నాగరాజ్ తర్వాతి కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ రూ.1,358 కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు. 2018తో పోల్చితే ఆయన ఆస్తులు 62 శాతం మేర పెరిగినట్టు పేర్కొన్నారు. అప్పట్లో తన ఆస్తులు రూ.840 కోట్లుగా ప్రకటించారు.


Read More Latest National News And Telugu News
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.