యాప్నగరం

ఈసారి తమిళనాడు సీఎం పీఠం ఎవరిది.. టైమ్స్ నౌ సర్వే, వార్ వన్‌సైడ్

MK Stalin: తమిళనాడు ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది? తమిళనాడుకు ముఖ్యమంత్రిగా ఎవరు వస్తారు? కమల్ హాసన్ విజయావకాశాలు ఏమిటి? టైమ్స్ నౌ సీ ఓటర్ సర్వేలో ఆసక్తికర ఫలితాలు..

Samayam Telugu 10 Mar 2021, 2:48 pm
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తమిళనాడులో ఓటర్ల నాడీ పట్టుకునే ప్రయత్నం చేసింది ప్రముఖ ఇంగ్లిష్ ఛానెల్ టైమ్స్ నౌ. టైమ్స్ నౌ సీ ఓటర్ సర్వే ప్రకారం.. ఈసారి ఎన్నికల్లో యూపీఏ కూటమి విజయం సాధించబోతోంది. యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలయన్స్ (UPA) కూటమి 158 సీట్లతో అధికారంలోకి వస్తుందని సర్వే వెల్లడించింది. 2016 ఎన్నికలతో పోలీస్తే.. ఈ కూటమి 60 సీట్లను అధికంగా గెలుచుకొని స్పష్టమైన ఆధిక్యం సాధిస్తుందని తెలిపింది.
Samayam Telugu తమిళనాడు ఎన్నికలు
Tamil Nadu Assembly Polls 2021


ఇక నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ (NDA) కూటమి ఈసారి ఎన్నికల్లో తన బలాన్ని కోల్పోనుందని టైమ్స్ నౌ సీ ఓటర్ సర్వే పేర్కొంది. కిందటిసారి ఎన్నికలతో పోలిస్తే 65 సీట్లు తగ్గుతాయని వెల్లడించింది. 2016 ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తమిళనాట 136 సీట్లతో అధికారంలోకి వచ్చింది.

ఇక తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎవరిని చూడనున్నారు అనే ప్రశ్నకు అక్కడి ఓటర్ల నుంచి స్పష్టమైన సమాధానం వచ్చింది. డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుమారుడు ఎంకే స్టాలిన్‌ను సీఎంగా చూడాలని ఉందని అత్యధికంగా 38.4 శాతం మంది చెప్పారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి పళనిస్వామి వైపు 31 శాతం మంది మొగ్గుచూపారు. వీకే శశికళకు 3.9%, పన్నీరుసెల్వానికి 2.6% శాతం ఓట్లు మాత్రమే రావడం గమనార్హం.

ఇక కొత్తగా పార్టీ స్థాపించి ఎన్నికల బరిలోకి దిగిన కమల్ హాసన్‌ను సీఎంగా చూడాలని ఉందని 7.4 శాతం మంది అభిప్రాయపడ్డారు. రజినీకాంత్‌కు 4.3 శాతం మంది ఓటేశారు. బహుశా ఆయన పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడంతో ఈ రకమైన అభిప్రాయం వచ్చి ఉండవచ్చు. ఇక స్టాలిన్ సోదరుడు అళగిరికి అత్యల్పంగా 1.7 మంది మాత్రమే మద్దతు ఇచ్చారు.


ఇక యూపీఏ కూటమికి 43.2 శాతం ఓటింగ్ నమోదవుతుందని టైమ్స్ నౌ సీ ఓటర్ ఓపీనియన్ ద్వారా తెలిసింది. ఎన్డీఏ కూటమికి 32.1 శాతం ఓట్ షేర్ వస్తుందని వెల్లడించింది. 2016 ఎన్నికలతో పోలిస్తే ఎన్డీయే కూటమికి 11.6 శాతం ఓటింగ్ తగ్గుతుందని పేర్కొంది.

ప్రధాని మోదీ పాలన పట్ల తమిళనాట పెద్ద ఎత్తున అసంతృప్తి వ్యక్తమైంది. 51.09% మంది అసంతృప్తిగా ఉన్నామని అభిప్రాయపడ్డారు. 24.55 శాతం మంది పర్వాలేదని సమాధానమిచ్చారు. 17.29 శాతం మంది నరేంద్ర మోదీ పాలనతో సంతృప్తిగా ఉన్నామని తెలిపారు.

తమ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని వెల్లడి కావడం పట్ల డీఎంకే ఎంపీ, కరుణానిధి కుమార్తె కనిమొళి సంతోషం వ్యక్తం చేశారు. అయితే.. సర్వేలో పేర్కొన్న వాటి కంటే చాలా ఎక్కువ స్థానాలను గెలుచుకుంటామని దీమా వ్యక్తం చేశారు. పళనిస్వామి పాలన పట్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని పేర్కొన్నారు. ఢిల్లీ నుంచి వస్తున్న ఆదేశాల మేరకే చెన్నైలో పాలన సాగుతుండటం పట్ల తమిళ ప్రజలు నిరాశగా ఉన్నారని ఆమె అన్నారు. తమకు ఘన విజయం కట్టబెడుతారని చెప్పారు.

234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల్ 6న ఒకే విడతలో పోలింగ్ జరుగనుంది. మే 2న ఓట్ల లెక్కింపు చేపడతారు. అదే రోజు ఫలితాలు వెల్లడి కానున్నాయి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.