యాప్నగరం

అభ్యర్థులకు బి-ఫారాలు.. కేటీఆర్‌కు కీలక బాధ్యతలు

ప్రత్యర్థులు ఎవరనేది మనకు ముఖ్యం కాదని, తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ వెంటే ఉన్నారని గులాబీ అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

Samayam Telugu 11 Nov 2018, 9:21 pm
అసెంబ్లీ ఎన్నికల కోసం ఇదివరకే ప్రకటించిన 107 మంది అభ్యర్థులకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ బి-ఫారాలను అందజేశారు. ఆదివారం మధ్యాహ్నం సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో సభలో పాల్గొన్న కేసీఆర్.. సాయంత్రం తెలంగాణ భవన్‌లో పార్టీ అభ్యర్థులతో సమావేశం అయ్యారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ అనుసరించాల్సిన వ్యూహాలను అభ్యర్థులకు వివరించారు. ప్రత్యర్థులు ఎవరనేది మనకు ముఖ్యం కాదని, తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ వెంటే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు.
Samayam Telugu KCR ANd KTR


ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో డిసెంబర్ 3లోగా హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. మరోవైపు టీఆర్ఎస్ అభ్యర్థులకు ఎన్నికల్లో సలహాలు, సూచనలు ఇచ్చేందుకు కో ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేశారు. పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని, గ్రేటర్ హైదరాబాద్‌లో అద్భుత ఫలితాలు సాధించబోతున్నామని నేతల్లో నూతన ఉత్సాహాన్ని నింపారు కేసీఆర్. ఎన్నికల తేదీలోగా దాదాపు 70 నుంచి 80 నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తానని పార్టీ అభ్యర్థులకు వివరించారు.

గ్రేటర్ బాధ్యతలు కేటీఆర్‌కు..
గ్రేటర్ హైదరాబాద్‌లో ఎన్నికల ప్రచార బాధ్యతలు తనయుడు, ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్‌కు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. నామినేషన్ల పర్వం రేపటి (నవంబర్ 12) నుంచి 19వ తేదీవరకు కొనసాగనున్న తరుణంలో నామినేషన్ల దాఖలుపై అభ్యర్థులకు అవగాహన కల్పించారు. ఏవైనా అనుమానాలుంటే పార్టీ నేతలను సంప్రదించాలని చెప్పారు. కేవలం ఐదు మందితో వెళ్లి నామినేషన్ వేయాలని అభ్యర్థులకు సూచించారు. ఎన్నికల అధికారులు, పోలీసులతో మర్యాదగా ప్రవర్తించాలన్నారు. కూటమి అభ్యర్థుల జాబితా విడుదల తర్వాత.. అసంతృప్తులతో టచ్‌లో ఉంటే ప్రయోజనం ఉంటుందని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.