యాప్నగరం

నరకానికి నకలు.. సింగరేణి కాలనీ@ హైదరాబాద్

ఐఎస్ సదన్ డివిజన్‌లోని సింగరేణి కాలనీ నరకానికి నకలులా మారింది. రోడ్లు లేక, డ్రైనేజీ సదుపాయం కరువై.. ఇక్కడి ప్రజలు నరకం చూస్తున్నారు. ఉండటానికి ఇళ్లు లేక, అపరిశుభ్ర వాతావరణంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడి ప్రజల దుర్భర జీవితంపై ‘సమయం’ ప్రత్యేక కథనం.

Samayam Telugu 16 Oct 2018, 5:16 pm
హైదరాబాద్‌లోని సింగరేణి కాలనీ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. ఇక్కడ ఐదు వేలకు పైగా గుడిసెల్లో జనం దుర్భర జీవితం గడుపుతున్నారు. పది వేలకుపైగా ఉన్న ఓటర్లు.. ఎన్నికలొస్తేనే నాయకులకు గుర్తొస్తున్నారు. గుడిసెల్లో ఉంటున్న వారికి పక్కా ఇళ్లు నిర్మించేందుకు గత ప్రభుత్వాల హయాంలో ఎప్పుడో ప్రయత్నాలు జరిగాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో కాలనీ వాసులకు డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని టీఆర్ఎస్ హామీ ఇచ్చింది. ఈ ప్రాంత అభివృద్ధి తన బాధ్యత అని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. కానీ ఏళ్లు గడిచినా సింగరేణి కాలనీ మురికి వాడగానే మిగిలిపోయింది. ఈ పరిస్థితి మారెదెన్నడని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Samayam Telugu singareni-colony1


ఎటు చూసినా చెత్తాచెదారం దర్శనమిస్తుండగా.. కనీసం ఇక్కడ ఎలాంటి రోడ్డు సదుపాయం లేదు. ఇరుకు ఇళ్లలో.. ప్రజలు జీవితం వెళ్లదీస్తున్నారు. డ్రైనేజీ సదుపాయం లేకపోవడంతో మురుగు నీరు రోడ్ల మీదే ప్రవహిస్తోంది. చెత్తాచెదారం కారణంగా.. పందులు స్వైర విహారం చేస్తున్నాయి. అపరిశుభ్ర వాతావరణంలో పెరుగుతున్న పిల్లలను రోగాల బెడద వెంటాడుతోంది. ఇక్కడ నివసించే వారందరిదీ రెక్కాడితే గానీ డొక్క ఆడని పరిస్థితి.
గతంలో ఎప్పుడో.. ఇక్కడ సామూహిక మరుగుదొడ్లు నిర్మించారు. కానీ ఇప్పుడవి నిరూపయోగంగా మారాయి. దీంతో మహిళలు కూడా ఆరుబయటే కాలకృత్యాలు తీర్చుకోవాల్సిన దుస్థితి. ప్రభుత్వం తమను ఆదుకోవాలని, ఇళ్లు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.