యాప్నగరం

Telangana Assembly: అల్లుడుకు మామ షాక్, తాను సీఎం అభ్యర్థినంటూ..

ఆ నియోజకవర్గం టికెట్.. మామా అలుళ్ల మధ్య చిచ్చుపెట్టనుందా? లేదా, కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఆయనేనా? వీరి గొడవకు మహాకూటమి చెక్ పెడుతుందా?

Samayam Telugu 1 Nov 2018, 7:13 pm
తెలంగాణ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. కాంగ్రెస్‌లో ఇంకా అభ్యర్థుల ప్రకటన చేయని నేపథ్యంలో ఆశావహుల మధ్య గట్టిపోరే జరుగుతోంది. టికెట్ల కోసం ఢిల్లీ స్థాయిలో పైరవీలు కూడా చేస్తున్నారు. అధిష్టాన పెద్దలను ప్రసన్నం చేసుకుంటున్నారు. అలాగే, పార్టీకే అంకితమైన కుటుంబ సభ్యుల మధ్య కూడా టికెట్ల కోసం వాదనలు జరుగుతున్నాయి.
Samayam Telugu Untitled121


కుటుంబంలో ఒకరికి మాత్రమే టికెట్ అనే నిబంధనను కాంగ్రెస్ పక్కాగా అమలు చేస్తే ఈ గొడవలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధిష్టానానికి ఎంతో దగ్గరగా ఉంటూ.. సోనియమ్మను ‘అమ్మా’ అని పిలుచుకునే మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ, ఆయన అల్లుడు మన్నె క్రిశాంక్ కాంగ్రెస్ నుంచి కంటోన్మెంట్ నియోజకవర్గం టికెట్ ఆశిస్తున్నారు.

ఈ టికెట్‌పై సర్వే అల్లుడు క్రిశాంక్ చాలా ఆశలు పెట్టుకున్నారు. సర్వే ఎంపీగా పోటీ చేస్తారనే ఉద్దేశంతో ఆ టికెట్ తనకే దక్కుతందనే ధీమాతో ఉన్నారు. మొదట్లో తనకు లేదా తన అల్లుడుకు ఈ టికెట్ ఇవ్వాలని కోరిన సర్వే.. అల్లుడుకు షాకిచ్చారు. ఆ టికెట్ తనకు కావాలంటూ అధిష్టానం వద్ద ఆయన గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌లో ఆయన సీనియర్ అభ్యర్థి కావడం, సీఎం అభ్యర్థిగా ఎస్సీలకు ప్రాధాన్యమిస్తే తప్పకుండా తనకు అవకాశం వస్తుందనే ఆశతో సర్వే తప్పకుండా ఈ టికెట్ దక్కించుకోవాలనే పట్టుదలతో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి.

అల్లుడు మన్నె క్రిశాంక్‌తోపాటు ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ కార్యదర్శి శ్రీగణేష్‌ కూడా ఈ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. సర్వేతో పోల్చితే.. క్రిశాంక్, శ్రీగణేష్‌లే ఇక్కడ వివిధ కార్యకలాపాలతో ప్రజలకు కాంగ్రెస్‌ పార్టీ ఉనికిని కాపాడుతున్నారు. 1957లో నియోజకర్గం ఆవిర్భవించిన తర్వాత వరసగా ఆరుసార్లు కాంగ్రెస్ గెలుపొందింది. ఆ తర్వాత మరో పదేళ్ల వరకు కాంగ్రెస్ విజయం దక్కలేదు. మధ్యలో 1989, 1994, 2009లో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది.

కాంగ్రెస్ పరాజయం నేపథ్యంలో టీడీపీ ఇక్కడ తిరుగులేని పార్టీగా ఎదిగింది. 1985, 1994, 1999, 2004, 2014వ సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ విజయం సాధించింది. 1994 నుంచి జి.సాయన్న వరస విజయాలతో కాంగ్రెస్ ఓటు బ్యాంకును గల్లంతు చేశారు. ప్రస్తుతం ఆయన టీఆర్ఎస్‌లోకి చేరడంతో కాంగ్రెస్‌లో ఆశలు చిగురించాయి. అయితే, కంటోన్మెంట్‌లో తమ ఓటు బ్యాంకు భద్రంగా ఉందని, తమకే ఈ సీటు ఇవ్వాలని టీడీపీ కోరుతోంది. అదే జరిగితే.. మహాకూటమి రూపంలో మామా అలుళ్లకు నిరాశ తప్పదేమో!!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.