యాప్నగరం

Telangana Elections: కాంగ్రెస్ జాబితాపై బీసీ సంఘాలు ఫైర్.. బంద్‌కు పిలుపు!

భాగస్వామ్య పార్టీలతో అవగాహన కారణంగా కొన్ని స్థానాలను వదులుకోవడంతో అన్ని రాజకీయ పార్టీల్లోనూ అసమ్మతి చెలరేగుతోంది. కొందరు రెబల్స్‌గా బరిలో నిలిచేందుకు ప్రయత్నిస్తున్నారు.

Samayam Telugu 13 Nov 2018, 1:08 pm
మహాకూటమిలో సీట్ల సర్దుబాటుపై ఓవైపు అసమ్మతి సెగలు రాజుకుంటుండగా, టికెట్ల కేటాయింపుల్లో కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయం చేసిందని బీసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. 65 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను కాంగ్రెస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, వీటిలో 13 మంది మాత్రమే బీసీలు ఉన్నారని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. మొత్తం అభ్యర్థుల్లో 23 మంది రెడ్డి సామాజికవర్గం నేతలే ఉన్నారని ఆయన పేర్కొన్నారు. బీసీలకు అన్యాయం చేసినందుకు నిరసనగా నవంబరు 17న తెలంగాణ బంద్‌కు కృష్ణయ్య పిలుపునిచ్చారు. బీసీలకు కనీసం 25 సీట్లు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. జనాభాలో కేవలం 4 శాతం ఉన్న రెడ్లకు 23 సీట్లు ఇవ్వడం ఎంతవరకూ సమంజసమని నిలదీశారు. బీసీలకు రాజ్యాధికారం దక్కినప్పుడే తమ సామాజిక వర్గం అభివృద్ధి చెందుతుందని ఆయన వ్యాఖ్యానించారు. బీసీ సామాజికవర్గం నేతలందరూ ఈ బంద్ ను విజయవంతం చేయాలని ఆయన కోరారు.
Samayam Telugu R.Krishnaiah


సోమవారం అర్థరాత్రి కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన జాబితాలో రెడ్డి సామాజికవర్గానికి 23, బీసీలకు 13, వెలమ సామాజిక వర్గానికి 3, మున్నూరు కాపులకు ఐదు, మాదిగ 10, మాల- 5, లంబాడీ-2, ఆదివాసీ- 4, మైనార్టీ- 4, గౌడ్‌ నలుగురు, బ్రాహ్మణ, పద్మశాలీ, యాదవ కులాలకు చెందిన ఒక్కొక్కరకు దక్కాయి. ఈ జాబితాలో 10 మంది మహిళలకు చోటు దక్కింది. మరోవైపు తెలుగుదేశం పార్టీ సైతం తనకు కేటాయించిన 14 స్థానాల్లో 9 చోట్ల అభ్యర్థులను ఖరారు చేసింది. టీడీపీ ప్రకటించిన జాబితాలో నామా నాగేశ్వరరావు, సండ్ర వెంకట వీరయ్య, రేవూరి ప్రకాశ్ రెడ్డి, దేవేందర్ గౌడ్ తనయుడు వీరేందర్ గౌడ్‌, ఎర్ర శేఖర్ తదితరులు ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.