యాప్నగరం

NOTAతో ఓటమి బాట.. ఎన్నికల్లో షాకింగ్ ఫలితాలు!

ఈ ఎన్నికల్లో NOTA మీట.. అభ్యర్థుల గెలుపోటములపై ఏ విధంగా ప్రభావం చూపిందో చూడండి.

Samayam Telugu 13 Dec 2018, 9:43 pm
తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ స్పష్టమైన మెజారిటీ సాధించిన సంగతి తెలిసిందే. అయితే, గత ఎన్నికలతో పోల్చితే.. ఈసారి ‘నోటా’ మీట నొక్కిన ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. పలువురు ముఖ్య నేతల ఓటమిలోనూ ‘నోటా’ కీలక పాత్ర పోషించింది. కొన్ని చోట్ల ఆధిక్యం కంటే ‘నోటా’కు పోలైన ఓట్లే అధికంగా ఉండటం గమనార్హం.
Samayam Telugu 2693A617-CABD-43EB-B76A-36BF2E9203DE


ఎన్నికల్లో బరిలో దిగిన అభ్యర్థులెవరూ నచ్చకపోతే ఓటర్లు ‘నోటా’ (NOTA - None Of The Above) మీట నొక్కే సదుపాయం ఉన్న సంగతి తెలిసిందే. తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో ‘నోటా’ ఐదు చోట్ల గెలుపోటములను నిర్దేశించిందంటే దాని ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

  • 2014లో ఎన్నికల్లో నోటాకు 1.25 లక్షలు ఓట్లు పడ్డాయి.
  • 2018 ఎన్నికల్లో నోటాకు 2.2 లక్షల ఓట్లు పోలయ్యాయి.
  • 2014తో పోల్చితే నోటా ఓట్ల శాతం 47 శాతానికి పెరిగింది.
  • ఓటింగ్‌ శాతంలో నోటా ఏడో స్థానంలో ఉంది.
  • వర్ధన్నపేట నియోజకవర్గంలో నోటాకు అత్యధికంగా 5864 ఓట్లు పడ్డాయి.
  • మిర్యాలగూడలో అత్యల్పంగా 27 మంది నోటాకు ఓటేశారు.
  • ఖైరతాబాద్‌లో పోటీచేసిన 32 మంది అభ్యర్థుల్లో నోటాకు 1315 ఓట్లతో 5వ స్థానం వచ్చింది
  • ఖమ్మంలో బీజేపీ అభ్యర్థి కంటే ఎక్కువగా 3484 ఓట్లు నోటాకు వచ్చాయి.
  • ములుగులోనూ బీజేపీ అభ్యర్థి కంటే నోటాకు 3248 మంది ఓట్లేశారు.
  • హరీష్ రావు పోటీ చేసిన సిద్దిపేటలో 2932 మంది నోటా నొక్కారు.
  • కేటీఆర్ పోటీచేసిన సిరిసిల్లలో 2321 మంది ‘నోటా’కు ఓటేశారు.
  • కేసీఆర్ పోటీ చేసిన గజ్వేల్‌లో 1546 మంది నోటాను ఎంచుకున్నారు.
  • నందమూరి సుహాసిని పోటీ చేసిన కూకట్‌పల్లిలో 2,134 మంది నోటాకు ఓటేశారు.
  • వర్ధన్నపేట నియోజకవర్గంలో అత్యధికంగా 5864 ఓట్లు నోటాకు వచ్చాయి.

బీజేపీ ముఖ్యనేత కిషన్ రెడ్డికి షాక్: అంబర్‌పేట్‌లో బీజేపీ సీనియర్‌ నేత కిషన్‌రెడ్డి ఓటమికి ‘నోటా’యే కారణమైంది. టీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేశంకు 61,558 ఓట్లు రాగా, కిషన్‌ రెడ్డికి 60,542 ఓట్లు లభించాయి. కిషన్ రెడ్డి 1,016 తేడాతో ఓడిపోయారు. ఇక్కడ ‘నోటా’కు 1,462 ఓట్లు పడ్డాయి. ఖమ్మం జిల్లాలోని వైరాలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. స్వతంత్ర అభ్యర్థి రాములుకు 52,650 ఓట్ల లభించగా.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బానోత్‌ మదన్‌లాల్‌‌కు 50,637 ఓట్లు వచ్చాయి. వీరి ఓట్ల మధ్య తేడా 2,013 ఉండగా.. నోటాకు 2,360 ఓట్లు పడటం గమనార్హం. తుంగతుర్తిలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గ్యాదరి కిశోర్‌కుమార్‌ 199 ఓట్ల మెజారిటీతో విజయం సాధించగా.. నోటాకు 1175 ఓట్లు పోలయ్యాయి.

టీజేఎస్, సీపీఐల కంటే... ‘నోటా’కే ఎక్కువ: ప్రజాకూటమి తరఫున పోటీచేసిన టీజేఎస్, సీపీఐల కంటే నోటాకే ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. 119 స్థానాల్లో 3 సీట్లలో మాత్రమే పోటీచేసిన సీపీఐకి 83,215 ఓట్లు లభించాయి. 0.4 ఓట్ల శాతం ఉంది. నాలుగు స్థానాల్లో పోటీచేసిన టీజేఎస్‌కు 95,364 ఓట్లు పోలయ్యాయి. మొత్తం ఓట్ల శాతం 0.5. అయితే, 119 స్థానాల్లో ‘నోటా’కు పడిన ఓట్లు 1.1 శాతం. సీపీఐ, టీజేఎస్‌లు తక్కువ స్థానాల్లో పోటీ చేయడం వల్ల ఓట్ల శాతం తక్కువగా ఉందనే విషయాన్ని గమనించాలి. అయితే, రాజకీయ పార్టీలతో సమానంగా ఓట్లు సాధిస్తున్న ‘నోటా’తో భవిష్యత్తులో అభ్యర్థులకు మరింత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశాలు లేకపోలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.