యాప్నగరం

Telangana Elections: 14వ సీటును టీడీపీ వదులుకోడానికి కారణం ఇదేనట

తెలంగాణలో నామినేషన్ల పర్వం ముగియడంతో అన్ని పార్టీలకు రెబల్స్ భయం వెంటాడుతోంది. దీంతో వారిని బుజ్జగించేందుకు వివిధ పార్టీలు రంగంలోకి దిగాయి.

Samayam Telugu 20 Nov 2018, 8:49 am
తెలంగాణ శాసనసభ ఎన్నికలకు సోమవారం (నవంబరు 19)తో నామినేషన్ ప్రక్రియ ముగిసింది. మొత్తం 119 నియోజకవర్గాలకు గానూ 3,584 నామినేషన్లు దాఖలైనట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. చివరి రోజు అత్యధికంగా 2,087 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక, కూటమిగా బరిలోకి దిగిన కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐలు తమకు కేటాయించిన స్థానాల్లోనే కాకుండా మిత్రుల సీట్లలోనూ నామినేషన్లు దాఖలు చేశాయి. దీంతో కొన్ని చోట్ల స్నేహపూర్వక పోటీ తప్పేలాలేదు. అయితే, నామినేషన్ల ఉపసంహరణ తర్వాతే దీనిపై ఓ స్పష్టత రానుంది. ఈ నేపథ్యంలో టీడీపీకి 14 సీట్లను కేటాయించగా, కేవలం 13 చోట్ల మాత్రమే ఆ పార్టీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఒక సీటును టీడీపీ వదులుకోవాల్సి వచ్చింది. దీనిపై ఆ పార్టీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి... తెలంగాణలో మహాకూటమి అధికారంలోకి రావడమే టీడీపీ లక్ష్యమని వ్యాఖ్యానించారు.
Samayam Telugu Telangana-TDP-MLA-Candidate


కూటమి విశాల ప్రయోజనాలను కాపాడే క్రమంలోనే తమకు కేటాయించిన 14వ స్థానాన్ని వదులుకున్నామని ఆయన తెలిపారు. అంతేకాదు, తెలుగుదేశం పార్టీలో రెబెల్స్ లేరని... ఆశావహులు మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు. ఆశావహులంతా తమ నామినేషన్లను ఉపసంహరించుకుంటారని రావుల వెల్లడించారు. మహాకూటమి తరపున అధినేత చంద్రబాబునాయుడు ప్రచారాన్ని నిర్వహిస్తారని... దీనికి సంబంధించి రూట్ మ్యాప్ సిద్ధమవుతోందని స్పష్టం చేశారు. చంద్రబాబును విమర్శించనిదే టీఆర్ఎస్ నేతలకు పొద్దు గడవడం లేదని ఎద్దేవా చేశారు. నాలుగున్నరేళ్ల కాలంలో ఏం చేశారో కూడా చెప్పుకోలేని దీన స్థితిలో టీఆర్ఎస్ నేతలు ఉన్నారని రావుల చంద్రశేఖర్ విమర్శించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.