యాప్నగరం

కేంద్ర విద్యుత్ అథారిటీయే ఆ విషయం చెప్పింది: కేసీఆర్

తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే టాప్ అని సీఎం కేసీఆర్ చెప్పారు. మంత్రి జగదీశ్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు.

Samayam Telugu 23 Nov 2018, 6:52 pm
టీఆర్‌ఎస్ పార్టీకి ప్రజలే బాసులని సీఎం కేసీఆర్ అన్నారు. టీఆర్ఎస్ చేతిలో అధికారం ఉంటే నిర్ణయాలన్నీ ఇక్కడే జరుగుతాయని.. కూటమి అధికారంలోకి వస్తే ప్రజలు దరఖాస్తు పట్టుకొని ఢిల్లీకి పోవాలా, అమరావతికి పోవాలా.. అని కేసీఆర్ ప్రశ్నించారు. టికెట్లు పంచుకోవడానికే కాంగ్రెస్ నేతలు వందసార్లు ఢిల్లీ చుట్టూ తిరిగారని విమర్శించారు. తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థులు టికెట్ల కోసం అమరావతిలో క్యూ కట్టారని, ఆ పార్టీకి ఇంతకంటే దౌర్భాగ్యం మరోటి ఉంటుందా అని కేసీఆర్ ఎద్దేవా చేశారు. శుక్రవారం (నవంబర్ 23) సాయంత్రం సూర్యాపేట ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగించారు.
Samayam Telugu kcr3


‘ఎన్నికల సమయంలో చాలా మంది చాలా మాటలు చెప్తారు. ఓటు ఆశామాషీగా వేయొద్దు. అది మన తలరాత మార్చుకునే ఆయుధం. ఓటు వేసే ముందు అన్ని ఆలోచించుకొని వేయాలి. ఏది మంచో.. ఎవరు ఏం చేశారో ప్రజలకు తెలుసు. ప్రజాస్వామ్యంతో ఏది మంచిదైతే అదే గెలవాలి’ అని కేసీఆర్ అన్నారు.

టీఆర్ఎస్ పాలన రాక ముందు విద్యుత్ ఎలా ఉండేదో, ఇప్పుడు ఎలా ఉందో ప్రజలకు తెలుసునని కేసీఆర్ చెప్పారు. తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలో తెలంగాణ నంబర్ 1గా ఉందని, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీయే స్వయంగా ఈ విషయం చెప్పిందని తెలిపారు. ఈ విషయంలో కేంద్ర సగటు కంటే, అన్ని రాష్ట్రాల సగటు కంటే తెలంగాణ విద్యుత్ వినియోగమే అధికంగా ఉందని చెప్పారు.

‘తెలంగాణ వస్తే రాష్ట్రం చిమ్మ చీకటి అవుతుందని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పిండు. ఇప్పుడు ఏపీలో 24 గంటల కరెంట్ లేదు.. కానీ, మన దగ్గర ఉంది’ అని కేసీఆర్ అన్నారు. పగలు, రాత్రి కష్టపడితేనే ఈ స్థాయికి చేరుకున్నామని అన్నారు. విద్యుత్ మంత్రి జగదీశ్ రెడ్డికే ఆ ఘనత దక్కుతుందని ప్రశంసించారు.

ప్రపంచంలో టాప్ 10 పథకాల్లో ‘రైతు బంధు’ ఒకటిగా ఐక్యరాజ్య సమితి గుర్తించిందని కేసీఆర్ చెప్పారు. రైతు బీమా అంతకంటే గొప్ప పథకమని వెల్లడించారు. రైతు మరణిస్తే అతడి కుటుంబం రోడ్డున పడకూడదని రైతు బీమా పెట్టినట్లు చెప్పారు.

‘మానవీయ కోణంలో ప్రజా సమస్యల పరిష్కారమే ఇతివృత్తంగా పాలన సాగిస్తున్నాం. పేదింటి ఆడపిల్లల పెళ్లికి రూ.1,00,116 ఇస్తున్నాం. ప్రస్తుతం ఉన్న పింఛన్లన్నీ రెండింతలు చేస్తాం. నిరుద్యోగులకు రూ. 3016 భృతి ఇస్తాం. కేసీఆర్ కిట్ ద్వారా లక్షలాది మంది ఆడబిడ్డలకు మేలు జరుగుతోంది. ప్రసవాల కోసం వేలకు వేలు ఖర్చు చేయకుండా ప్రభుత్వమే రూ.12 వేలు అందిస్తోంది’ అని కేసీఆర్ చెప్పారు.

తెలంగాణ వచ్చి ఉండకపోతే, కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోతే.. జగదీష్ రెడ్డి మంత్రి కాకపోతే ఈ జన్మలో కూడా సూర్యాపేట జిల్లా అయుండేది కాదని కేసీఆర్ అన్నారు. సూర్యాపేట సభకు జనం ప్రభంజనంలా తరలివచ్చారని, జగదీశ్ రెడ్డి భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని ఆయన దీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గ స్థాయి సభలన్నీ జిల్లా స్థాయి సభల్లా జరుగుతున్నాయన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.