యాప్నగరం

ముదిగొండలో ఉద్రిక్తత.. బలగాల మోహరింపు

ముదిగొండలో టీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్య వివాదం ఉద్రిక్తతలకు దారి తీసింది. దీంతో పోలీసులు భారీగా బలగాలను మోహరించారు.

Samayam Telugu 2 Dec 2018, 9:04 pm
మ్మం జిల్లా ముదిగొండ మండలం సువర్ణాపురం గ్రామంలో ఆదివారం రాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్, టీఆర్ఎస్ వర్గాల మధ్య చోటుచేసుకున్న వివాదం ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. దీంతో పోలీసులు ఇరువర్గాలను అదుపు చేయడానికి ఇండో టిబెటన్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (ఐటీబీపీ) బలగాలను రంగంలోకి దింపారు.
Samayam Telugu Untitled11


వివాదానికి కారణం ఇదే: టీఆర్ఎస్‌ కార్యకర్తలు ఓటర్ల నుంచి ఆధార్ కార్డుల జిరాక్స్‌లు, బ్యాంక్ అకౌంట్, ఫోన్ నెంబర్లను సేకరిస్తున్నారంటూ ఆదివారం ఉదయం కాంగ్రెస్ కార్యకర్తలు ముదిగొండ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఆధార్ జిరాక్స్‌లు, ఫోన్ నెంబర్లు సేకరిస్తున్న వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే, సాయంత్రం సువర్ణాపురంలో జరిగిన మధిర కాంగ్రెస్ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క సభలో ఆ వ్యక్తి మళ్లీ కనిపించడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలీసులు అధికార పార్టీకి చెప్పుచేతల్లో పనిచేస్తున్నారంటూ భట్టి విక్రమార్కతో సహా కార్యకర్తలంతా పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. ఈ సమాచారం తెలిసి.. టీఆర్ఎస్ నేత లింగాల కమల్ రాజ్ కూడా పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి కార్యకర్తలతో కలిసి బైఠాయించారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ.. పార్టీల అనుకూల నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఐటీబీపీ బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆందోళనకారులను చెల్లచెదురు చేసేందుకు లాఠీలకు పనిచెప్పారు. పోలీసులు ఇరువర్గాలకు సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.