యాప్నగరం

కాంగ్రెస్ ‘సీఎం’ ఎవరని అడగొద్దు: జానారెడ్డి

గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేకనే తెలంగాణ సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని ఎద్దేవా చేశారు.

Samayam Telugu 5 Nov 2018, 2:20 pm
ఓవైపు టీఆర్ఎస్ పార్టీని ఓడించేందుకు మహాకూటమిగా ఏర్పడిన పార్టీల సీట్ల లెక్క తేలక సతమతమవుతుంటే.. మరోవైపు కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరన్నదానిపై పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌లో సీఎం అభ్యర్థి ఎవరనేది ప్రస్తుతం అసందర్భం అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడమే తమ ముందున్న లక్ష్యమని జానారెడ్డి స్పష్టం చేశారు.
Samayam Telugu jana reddy


సీఎం ఎవరన్నదానిపై చర్చ అక్కర్లేదన్నారు. నవంబర్ 8న కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామని చెప్పారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేకనే తెలంగాణ సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని ఎద్దేవా చేశారు. నియంతలా ప్రవర్తిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కేసీఆర్.. ఈ ఎన్నికల్లో డబ్బు మూటలతో గెలవాలని చూస్తున్నారని జానారెడ్డి ఆరోపించారు. తమ ఓటుతో రాష్ట్ర ప్రజలు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అభిప్రాయపడ్డారు.

కూటమిలో కాంగ్రెస్‌కు 95 సీట్లు కేటాయించగా, టీడీపీకి 14 స్థానాలిచ్చారు. అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కోదండరామ్ పార్టీ టీజేఎస్ కనీసం 10 సీట్లు తమకు కేటాయించాలని కోరుతుండగా, సీపీఐకి దాదాపు 4 సీట్లు కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. సీట్ల విషయంపై సాధ్యమైనంత త్వరగా స్పష్టమైన ప్రకటన చేయకపోతే కూటమి విచ్ఛిన్నమయ్యే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.