యాప్నగరం

BJP: అద్వాణీకి మొండిచేయి.. కేంద్ర మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ రెండు రోజుల కిందట ప్రకటించిన విషయం తెలిసిందే. తొలి జాబితాలో మోదీ, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ సహా కీలక నేతలకు టిక్కెట్లు ప్రకటించారు.

Samayam Telugu 23 Mar 2019, 12:43 pm
సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ రెండు రోజుల కిందట ప్రకటించిన విషయం తెలిసిందే. తొలి జాబితాలో మోదీ, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ సహా కీలక నేతలకు టిక్కెట్లు ప్రకటించినా బీజేపీ కురువృద్ధుడు అద్వాణీకి మొండిచెయ్యి చూపింది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తోన్న గాంధీనగర్‌ స్థానాన్ని అమిత్‌ షాకు ఖరారు చేయడంపై రాజకీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విమర్శలపై స్పందించిన బీజేపీ నేత, కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ మాట్లాడుతూ.. ఇన్నాళ్ల అద్వాణీ ఎన్నికల విజయం వెనక అమిత్‌ షా ఉన్నారని వ్యాఖ్యానించారు. ‘అద్వాణీ గెలిచిన ప్రతి ఎన్నికల విజయం వెనక అమిత్‌ షా ఉన్నారు. ఆ నియోజకవర్గానికి షా ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తూ వచ్చారు. ప్రచారంలో భాగంగా అద్వాణీ విస్తృత పర్యటనలు చేసేవారు. అలాంటి సమయంలో అమిత్‌ షా కృషితో గాంధీనగర్‌లో ఆయనకు భారీ విజయం దక్కేదని’ జవదేకర్‌ వ్యాఖ్యానించారు. మరోవైపు గాంధీనగర్‌ నుంచి అమిత్‌ షాను బరిలో దింపాలని స్థానిక కార్యకర్తలు, నాయకులు కోరుకున్నారని అక్కడి ఎన్నికల పరిశీలకులు నిమాబెన్‌ ఆచార్య అన్నారు.
Samayam Telugu Prakash_Javadekar_EPS


అద్వాణీకి సీటు కేటాయించంకపోవడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. బీజేపీ ప్రభవానికి ముఖ్య కారకుడైన అద్వాణీని పక్కకు పెట్టి ఆయనను అగౌరవపరిచారని పలువురు ఆరోపించారు. దీంతో భాజపా వివరణ ఇచ్చింది. అంతేకాదు, ఈ ఎన్నికల్లో పోటీ చేయనని స్వయంగా తన నిర్ణయాన్ని అద్వాణీయే తెలియజేసినట్లు పార్టీలోని కొందరు నేతలు పేర్కొన్నారు. ఆయన నిర్ణయం తరవాతే గాంధీనగర్ నుంచి అమిత్‌ షాను పోటీకి నిలపాలని పార్టీ నిర్ణయించిందని వివరించారు.

ఇక, 1991 సాధారణ ఎన్నికల్లో గాంధీనగర్‌ పార్లమెంటు స్థానం నుంచి అద్వాణీ తొలిసారి పోటీచేసి కాంగ్రెస్ నేత జీఐ పటేల్‌పై విజయం సాధించారు. తర్వాత ఇక్కడ నుంచి 1998లో రెండోసారి బరిలోకి నిలిచి విజయం సాధించిన అద్వాణీ, తర్వాత నుంచి వరుసగా ఐదుసార్లు ఇదే నియోజకవర్గం నుంచి గెలుపొందుతూ వచ్చారు. గత ఎన్నికల్లో 4,85,000 రికార్డు మెజార్టీతో గెలుపొంది ఎనిమిదో సారి లోక్‌సభలో అడుగుపెట్టారు. ఈసారి మాత్రం ఆయనను బీజేపీ తప్పించడంతో విమర్శలు చెలరేగుతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.