యాప్నగరం

Rahul Gandhi: అమేథిలో ఓటమి.. వయనాడ్‌లో రికార్డు స్థాయి విజయం

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అమేథిలో ఓటమి పాలైనా.. కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి రికార్డు స్థాయి ఆధిక్యంతో గెలుపొందారు. పార్లమెంట్‌లో సగర్వంగా అడుగుపెట్టనున్నారు.

Samayam Telugu 24 May 2019, 12:12 am
బీజేపీ ప్రభంజనంలో సాక్షాత్తూ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓటమి పాలయ్యారు. అమేథిలో ఆయనపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గెలుపొందారు. అమేథిలో ఓటమి పాలైనా.. దక్షిణాది రాష్ట్రం కేరళలోని వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి రికార్డు స్థాయి మెజార్టీతో రాహుల్ విజయం సాధించారు. వయనాడ్‌ నుంచి రాహుల్ గాంధీ 4,31,770 ఓట్ల అఖండ మెజారిటీతో గెలపొంది పార్లమెంట్‌లో అడుగుపెట్టనున్నారు.
Samayam Telugu rahul
రాహుల్ గాంధీ


లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ రెండు చోట్ల పోటీచేసిన విసక్ష్ం తెలిసిందే. అమేథీతో పాటు వయనాడ్ (కేరళ)లోనూ ఆయన బరిలో దిగారు. అమేథీలో ఓటమి పాలవగా.. వయనాడ్‌లో సీపీఐ అభ్యర్థి పీపీ సునీర్‌పై 4,31,770 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రాహుల్ ఇచ్చిన స్ఫూర్తితో కేరళలో యూపీఏ ఏకంగా 19 స్థానాలు కైవసం చేసుకోవడం మరో విశేషం.

వయనాడ్‌లో రాహుల్ ఓ దశలో భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్లారు. దేశంలోనే అత్యధిక రికార్డు స్థాయి సాధించేలా కనిపించారు. కానీ, కౌంటింగ్‌లో చివరి రౌండ్లు వచ్చేసరికి ఆధిక్యం బాగా పడిపోయింది.

2014లో ఉప ఎన్నికలో బీజేపీ నేత ప్రితమ్ గోపీనాథ్‌రావు ముండే అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు. బీడ్ లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ఎస్.పాటిల్‌పై ఆమె 6,96,321 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. దేశంలో ఇప్పటివరకు ఇదే అత్యధిక మెజారిటీ. ఇక సాధారణ ఎన్నికలో పశ్చిమ బెంగాల్‌ నుంచి సీపీఎం అభ్యర్థి అనిల్ బసు 5,92,502 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

అమెథీలో కాంగ్రెస్ కంచుకోట బద్దలైంది. ఈ స్థానంలో బీజేపీ తరఫున బరిలో దిగిన స్మృతి ఇరానీ 47,558 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. స్మృతి ఇరానీకి 3,78,863 ఓట్లు పోలవ్వగా.. రాహుల్‌ గాంధీకి 3,31,305 ఓట్లు పోలయ్యాయి.

దశాబ్దాలుగా కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉంది అమేథీ. అక్కడి నుంచి గతంలో రాహుల్ తల్లిదండ్రులు సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ ప్రాతినిధ్యం వహించారు. 1967 నుంచి 2014 వరకు అమేథీలో 15 సార్లు ఎన్నికలు జరగ్గా.. 13 సార్లు కాంగ్రెస్ విజయం సాధించింది. 1977లో జనతా పార్టీ, 1998లో బీజేపీ అభ్యర్థులు గెలిచారు. మళ్లీ ఇన్నాళ్లకు అమేథీలో కాంగ్రెసేతర అభ్యర్థి విజయం సాధించారు. 2014లోనూ స్మతి ఇరానీ, రాహుల్ గాంధీ తలపడ్డారు. ఆ ఎన్నికల్లో రాహుల్ గాంధీ లక్ష ఓట్ల పైచిలుకు మెజార్టీతో విజయం సాధించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.