యాప్నగరం

కాన్పూర్‌లో ఢిల్లీ టార్గెట్ 196

అమిత్ మిశ్రా బౌలింగ్‌లో ఫించ్ వరుసగా రెండు సిక్సర్లు బాదేసి స్కోరు బోర్డును అమాంతం పెంచేశాడు. మధ్యలోనే కార్తీక్ కూడా జోరు అందుకోవడంతో

TNN 10 May 2017, 9:49 pm
ఐపీఎల్ పదో సీజన్‌లో ప్లేఆఫ్ ఆశలు వదులుకున్న గుజరాత్ లయన్స్ జట్టు బ్యాట్స్‌మెన్ స్వేచ్ఛగా చెలరేగిపోయారు. కాన్పూర్ వేదికగా ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అరోన్ ఫించ్ (69: 38 బంతుల్లో 6x4, 4x6) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ జహీర్ ఖాన్ గుజరాత్‌ను బ్యాటింగ్‌కి ఆహ్వానించాడు. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ డ్వేన్ స్మిత్ (8) లేని పరుగు కోసం ప్రయత్నించి ఆదిలోనే రనౌటవగా.. కెప్టెన్ సురేశ్ రైనా (6) నిరాశపరిచాడు. అయితే యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ (34: 25 బంతుల్లో 5x4, 1x6) తనదైన శైలిలో బౌండరీలు బాదగా.. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ దినేశ్ కార్తీక్ (40: 28 బంతుల్లో 4x4, 1x6) ఉపయుక్తమైన ఇన్నింగ్స్ ఆడటంతో గుజరాత్ కోలుకుంది. కానీ జట్టు స్కోరు 56 వద్ద నిలకడగా ఆడుతున్న ఇషాన్ కిషన్‌ని స్పిన్నర్ అమిత్ మిశ్రా బోల్తా కొట్టించడంతో ఆ జట్టు 56/3తో ఇబ్బందుల్లో పడినట్లు కనిపించింది.
Samayam Telugu gl vs dd delhi daredevils target 196
కాన్పూర్‌లో ఢిల్లీ టార్గెట్ 196


ఈ దశలో క్రీజులోకి వచ్చిన అరోన్ ఫించ్ బౌండరీ మోత మోగించాడు. ముఖ్యంగా అమిత్ మిశ్రా బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాదేసి స్కోరు బోర్డును అమాంతం పెంచేశాడు. మధ్యలోనే కార్తీక్ కూడా జోరు అందుకోవడంతో గుజరాత్ భారీ స్కోరు దిశగా సాగింది. ఈ క్రమంలోనే 32 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్న ఫించ్ చివర్లో టాప్ గేర్ వేయడంతో ఢిల్లీ‌లో కంగారు మొదలైంది. కానీ.. ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసిన మహ్మద్ షమీ యార్కర్‌తో ఫించ్‌ని బౌల్డ్ చేయడంతో గుజరాత్ చివరికి 195 పరుగులు చేయగలిగింది. ఢిల్లీ బౌలర్లలో మహ్మద్ షమీ, కమిన్స్, అమిత్ మిశ్రా, బ్రాత్ వైట్ తలో వికెట్ తీశారు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.