యాప్నగరం

బెంగళూరులో అర్థరాత్రి హైడ్రామా.. బయటపడ్డ వేలాది నకిలీ ఓటరు కార్డులు!

కర్ణాటక శాసనసభ ఎన్నికలకు మరో మూడు రోజులు మాత్రమే ఉండటంతో బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్‌లు గెలుపు కోసం తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి.

TNN 9 May 2018, 11:08 am
కర్ణాటక శాసనసభ ఎన్నికలకు మరో మూడు రోజులు మాత్రమే ఉండటంతో బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్‌లు గెలుపు కోసం తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు బెంగళూరులో వేలకొద్దీ నకిలీ ఓటరు కార్డులు బయటపడటం కలకలం రేపింది. ప్రభుత్వ అధికారులతో సంబంధం లేకుండా ఇంటర్నెట్ సాయంతో వేలాది కొత్త ఓటర్లను చేర్పిస్తోన్న ముఠా గుట్టును మంగళవారం అర్థరాత్రి రట్టు చేశారు. కర్ణాటక రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సంజీవ్‌కుమార్‌ అత్యవసరంగా విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి ఈ వివరాలను వెల్లడించారు. బెంగళూరు వ్యాప్తంగా ఒక్కో నియోజకవర్గంలో 6.03 శాతం కొత్త ఓటర్లు నమోదవగా, రాజరాజేశ్వరినగర్‌లో అది 10.3 శాతం ఉండడంతో అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు దర్యాప్తు చేపట్టడంలో గుట్టు బయటపడింది. రాజరాజేశ్వరీనగర్‌ పరిధి జలహళ్లిలోని ఎస్‌ఎల్వీ అపార్ట్‌మెంట్‌లో చట్టవిరుద్దంగా నిర్వహిస్తోన్న కొత్త ఓటర్ల నమోదు నకిలీ కేంద్రం బయటపడింది.
Samayam Telugu ఓటరు గుర్తింపు కార్డులు


అధికార వర్గాలకు తెలియకుండా రహస్యంగా సేకరించిన కోడ్‌ సాయంతో కొత్త ఓటర్లను జాబితాలోకి ప్రవేశపెట్టి నకిలీ కార్డులను సృష్టిస్తున్నారు. అధికారులు దాడుల చేయడంతో 9,756 కార్డులు బయటపడ్డాయి. మరో లక్ష ఓటరు గుర్తింపు కార్డులను తయారు చేయడానికి సిద్ధంగా ఉంచిన పత్రాలను సైతం గుర్తించారు. నకిలీ ఓటరు గుర్తింపు కార్డుల తయారీకి వినియోగిస్తున్న ఐదు ల్యాప్‌ట్యాప్‌లు, ఓ ప్రింటర్‌‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్టు ఎన్నికల అధికారి తెలిపారు. ఈ నియోజకవర్గంలో ఎన్నికపై 24 గంటల్లో కీలక నిర్ణయం తీసుకుంటామని ఆయన ప్రకటించారు. ఇదే కేంద్రంలో ఓ ఎమ్మెల్యే ఫోటోలు కూడా లభించినట్లు తెలియజేశారు. ఈ విషయం గురించి తెలుసుకున్న కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్‌లు అక్కడకు చేరుకుని, ఒకరిపైఒకరు విమర్శలు గుప్పించుకోవడం విశేషం. మాజీ ప్రధానమంత్రి హెచ్‌.డి.దేవేగౌడ పలువురు నేతలు, కార్యకర్తలతో కలసి ఈ ప్రాంతాన్ని పరిశీలించారు.

ఈ అంశంపై కఠిన చర్యలు తీసుకోకపోతే మరికొందరు ఇలాగే ఓటును బజారు వస్తువుగా మార్చేస్తారని కేంద్ర ఎన్నికల సంఘానికి ఆయన ఫిర్యాదు చేశారు. రాజరాజేశ్వరినగర్‌లో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోందని, ఉన్నతాధికారులు తక్షణం స్పందించాలని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేవకర్‌ ట్విట్టర్ ద్వారా స్పందించారు. బాదామి, రాజరాజేశ్వరినగర్‌ నియోజకవర్గాల్లో ఎన్నికలు తక్షణమే నిలిపివేయాలని కర్ణాటక నేత, కేంద్ర మంత్రి అనంతకుమార్‌ డిమాండు చేశారు. ఈ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తోన్న ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యకే కావడం గమనార్హం. ఆయన 2013 వరకు బీజేపీలోనే ఉన్నారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.