యాప్నగరం

ప్రేమపెళ్లి చేసుకున్న 3 నెలలకే బాలిక ఆత్మహత్య.. తెలంగాణలో విషాదం

అదే గ్రామానికి చెందిన శివకుమార్‌రెడ్డిని మూడు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న నవనీత ఆదివారం పుట్టింట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

Samayam Telugu 2 Jun 2020, 10:25 am
ప్రేమించి పెళ్లి చేసుకున్న బాలిక మూడు నెలలకే ఆత్మహత్య చేసుకున్న ఘటన రంగారెడ్డి జిల్లా దోమ మండలం పరిధిలోని గుండాల్ గ్రామంలో సోమవారం జరిగింది. గ్రామానికి చెందిన గుడిసె నర్సింహులు, లక్ష్మి దంపతుల కూమార్తె నవనీత(17), అదే గ్రామానికి చెందిన జన్మండ్ల హన్మంతురెడ్డి కుమారుడు శివకుమార్‌రెడ్డి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. మూడు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట బతుకుదెరువు కోసం హైదరాబాద్‌ వలస వచ్చారు. అయితే లాక్‌డౌన్ కారణంగా వారికి ఉపాధి దొరక్క ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలోనే భర్త తనను వేధిస్తున్నాడని నవనీత తల్లికి అనేకసార్లు ఫోన్ చేసి బాధపడింది.
Samayam Telugu నవనీత ఫైల్ ఫోటో


Also Read: నాన్నను మా అమ్మే చంపేసింది.. 15ఏళ్ల తర్వాత కుమార్తె ఫిర్యాదు

నెల రోజుల క్రితం శివకుమార్‌రెడ్డి భార్యతో కలిసి స్వగ్రామానికి వచ్చి నవనీతను పుట్టింట్లో వదిలేసి వెళ్లాడు. అప్పటి నుంచి మనస్తాపంగా ఉంటున్న బాలిక ఆదివారం రాత్రి ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇది గమనించిన కుటుంబసభ్యులు వచ్చి చూసేసరికే ఆమె ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరిగి గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు. మృతురాలి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై బాలల హక్కుల సంఘం తీవ్ర విచారం వ్యక్తం చేసింది.

Also Read: పెన్షన్ డబ్బుల కోసం నాయనమ్మ హత్య.. రంగారెడ్డి జిల్లాలో దారుణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.