యాప్నగరం

అక్కాచెల్లెళ్లపై పోలీసుల అకృత్యం.. వివస్త్రలను చేసి పైశాచిక దాడి

ముగ్గురు అక్కాచెల్లెళ్లపై అస్సాం పోలీసులు అరాచకానికి పాల్పడ్డారు. యువతిని ప్రేమించి తీసుకెళ్లిపోయిన యువకుడి ముగ్గురు అక్కలను స్టేషన్‌కు రప్పించి చిత్రహింసలు పెట్టారు. వివస్త్రలను చేసి లాఠీలతో చితక్కొట్టారు.

Samayam Telugu 19 Sep 2019, 2:01 pm
ఓ యువకుడు ప్రియురాలిని తీసుకుని పారిపోయిన ఘటనలో అస్సాం పోలీసులు అత్యంత కఠినాత్మకంగా వ్యవహరించారు. యువకుడి ముగ్గురు అక్కలను పోలీస్‌స్టేషన్‌కు రప్పించి వివస్త్రలను చేసి చితకబాదారు. అందులో ఓ మహిళ గర్భవతి అన్న కనికరం కూడా లేకుండా లాఠీలతో కొట్టడంతో ఆమెకు అబార్షన్ అయింది.
Samayam Telugu assam


అస్సాంలోని దర్రాంగ్‌ జిల్లాలోని సిపాఝార్‌ గ్రామానికి చెందిన ఓ యువకుడు స్థానికంగా ఉండే యువతిని ప్రేమించాడు. ఇద్దరూ కొద్దిరోజుల పాటు చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. అయితే ఇద్దరి మతాలు వేర్వేరు కావడంతో పెద్దలు తమ పెళ్లికి అంగీకరించరన్న ఆందోళనతో వారిద్దరు గ్రామం నుంచి పారిపోయారు. దీంతో యువతి తల్లిదండ్రులు యువకుడిపై ఫిర్యాదు చేశారు. తన కూతురిని మభ్యపెట్టి తీసుకెళ్లిపోయాడని ఆరోపించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుడి ముగ్గురు అక్కలను పోలీస్‌స్టేషన్‌కు రప్పించారు.

యువకుడి గురించి ఆరా తీయగా వారు తెలియదని చెప్పడంతో పోలీసుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ముగ్గురు మహిళలను స్టేషన్‌లో వివస్త్రలను చేసి తీవ్రంగా కొట్టారు. ఈ దారుణానికి పాల్పడిన వారిలో మహిళా పోలీస్ కూడా ఉండటం మరింత విచారకరం. పోలీసుల దెబ్బలకు ఓ మహిళకు అబార్షన్ అయింది. దీంతో ఆమె వెంటనే ఆస్పత్రికి తరలించారు. పోలీసుల దుర్మార్గం వెలుగులోకి రావడంతో ప్రజలు తీవ్ర నిరసనలు చేపట్టారు. దీంతో అస్సాం ప్రభుత్వం కర్కశత్వంగా వ్యవహరించిన పోలీసులను సస్పెండ్ చేసింది. ఈ ఘటనకు బాధ్యులను కఠినంగా శిక్షించాలని జాతీయ మహిళా సంఘం డిమాండ్‌ చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.