యాప్నగరం

వంతెనపై అదుపుతప్పిన కారు.. ఒకే కుటుంబంలోని ఐదుగురు మృతి

రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం చెందిన విషాద ఘటన ఝార్ఖండ్‌లో చోటుచేసుకుంది. వీరు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి నదిలోకి దూసుకెళ్లింది.

Samayam Telugu 23 Nov 2021, 11:30 am

ప్రధానాంశాలు:

  • వంతెనపై అదుపుతప్పి బోల్తాపడిన కారు.
  • 100 మీటర్ల లోతులోకి దూసుకెళ్లిన వాహనం.
  • అతివేగమే ప్రమాదానికి కారణమన్న పోలీసులు.
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
Picture used for representational purpose only
ఝార్ఖండ్‌లో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ధన్బాద్ (Dhanbad road accident)గోవింద్పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హింద్ హోటల్ వద్ద వంతెన వద్ద అదుపు తప్పిన కారు.. 100 మీటలర్ల లోతులోకి పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఓ చిన్నారి, ఇద్దరు మహిళలు ఉన్నారు. తీవ్రంగా గాయపడిన ఐదుగురూ ఘటనా స్థలిలోనే మృతిచెందారు. అతివేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.
ఘటనా స్థలిలో లభించిన ఆధార్ కార్డుల ఆధారంగా మృతులను వసీమ్ అక్రమ్, షకీల్ అక్తర్‌గా గుర్తించారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. లోపల చిక్కుకున్న కారును స్థానికుల సాయంతో (Road accident) బయటకు తీశారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. వేగంగా వెళుతుండగా.. మలుపును గమనించకపోవడంతో అదుపుతప్పి నదిలోకి దూసుకెళ్లిందని ప్రాథమికంగా నిర్ధారించారు.

మృతులు రామ్‌గఢ్‌లోని అసోటాండ్‌కు చెందినవారని పోలీసులు తెలిపారు. వీరు రామ్‌గఢ్ నుంచి అనసోల్‌కు స్విఫ్ట్ డిజైర్ కారులో వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం గురించి బాధిత కుటుంబానికి పోలీసులు సమాచారం అందజేశారు. కేసు నమోదుచేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.