యాప్నగరం

ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది వలస కూలీల దుర్మరణం

లాక్‌డౌన్ వేళ దేశంలో మరో ఘోర ప్రమాదం జరిగింది. బిహార్‌లోని బాగల్‌పూర్ జిల్లాలో 31వ జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో 9 మంది వలస కూలీలు మరణించారు.

Samayam Telugu 19 May 2020, 1:42 pm
లాక్‌డౌన్‌లో వలస ఊళ్లో బతకలేక సొంతూరికి వెళ్లేందుకు నానాకష్టాలు పడుతున్న వలస కూలీలను రోడ్డు ప్రమాదాల రూపంలో దురదృష్టం వెంటాడుతోంది. యూపీ రోడ్డు ప్రమాదంలో 23 మంది మరణించిన విషాద ఘటన మరువకముందే బిహార్‌లో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వలస కూలీలతో ఎక్కించుకుని వెళ్తున్న లారీ బోల్తా పడి 9 మంది మరణించిన ఘటన మంగళవారం ఉదయం చోటుచేసుకుంది.
Samayam Telugu బోల్తా కొట్టిన లారీ


భాగల్పుర్ జిల్లా నౌగాచియా పరిధిలోని అంభో చౌక్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వలస కూలీలతో వెళ్తున్న లోడు లారీ బస్సును స్వల్పంగా ఢీకొట్టి పక్కనే ఉన్న గుంతలోకి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో లోడుపై కూర్చుని ఉన్న కూలీలు 9 మంది మృత్యువాతపడ్డారు. వారందరినీ కోల్‌కతా నుంచి బిహార్‌లోని తమ స్వస్థలాలకు బయల్దేరిన వలస కూలీలుగా గుర్తించారు.

Also Read: ఫ్రెండ్ భార్యతో ఆ సంబంధం.. బెడ్రూమ్‌లో దొరికిపోవడంతో..

కోల్‌కతా నుంచి సైకిళ్లపై బయల్దేరిన వలస కూలీలు మార్గంమధ్యలో లారీ ఎక్కినట్లుగా అనుమానిస్తున్నారు. మృతుల వద్ద లభించిన ధ్రువపత్రాల ఆధారంగా వారంతా బిహార్‌లోని ఈస్ట్, వెస్ట్ చంపారన్ జిల్లాలకు చెందిన వారిగా గుర్తించారు. మరికొందరిని గుర్తించాల్సి ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్, క్లీనర్ అక్కడి నుంచి పరారయ్యారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పొక్లెయిన్‌ను రప్పించి లారీని బయటకు తీసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో బస్సు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదానికి గురైన బస్సు దర్భంగా నుంచి బంకా వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. వారందరినీ స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Read Also: గుంటూరు: ప్రియుడితో గొడవపడి వివాహిత ఆత్మహత్య.!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.