యాప్నగరం

హైవేపై తనిఖీలు.. ఓ వాహనంలో వందల కిలోల బంగారం చూసి పోలీసులు షాక్!

Tamil Nadu Elections 2021 తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 6న జరగనుండగా.. రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇదే సమయంలో ఓటర్లకు తాయిలాలు పంచడానికి సిద్ధమయ్యారు.

Samayam Telugu 14 Mar 2021, 10:20 am
తమిళనాడు శాసనసభ ఎన్నికలు వేళ భారీ ఎత్తున బంగారం రవాణా వ్యవహారం కలకలం రేపుతోంది. శుక్రవారం అర్ధరాత్రి సేలం-చెన్నై జాతీయ రహదారిపై అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఏకంగా 234 కిలోల బంగారు ఆభరణాలు పట్టుబడ్డాయి. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో గత కొన్ని రోజులుగా తమిళనాడు వ్యాప్తంగా విస్తృత తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సేలం-చెన్నై జాతీయ రహదారిపై పెరియారీ ప్రాంతంలో ఎన్నికల నిఘా దళం తనిఖీలు చేపట్టింది.
Samayam Telugu బంగారం స్వాధీనం


ఈ క్రమంలో చెన్నై నుంచి సేలం వైపు వస్తున్న ఓ వ్యాన్‌ను ఆపి తనిఖీ చేస్తుండగా.. అందులో ఉన్న బంగారం చూసి అధికారులు షాక్ తిన్నారు. పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలు తరలించడం, సరైన పత్రాలు లేకపోవడంతో అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. వ్యాన్ డ్రైవర్‌ సహా మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఆభరణాలను చెన్నైలోని ఓ ప్రముఖ నగల దుకాణం నుంచి సేలం తరలిస్తున్నారని, అక్కడ స్థానిక వ్యాపారులకు వీటిని సరఫరా చేయాలని పట్టుబడిన వ్యక్తులు విచారణలో తెలిపారు. ఎన్నికల కమిషన్‌కు దరఖాస్తు చేసుకున్నా అనుమతి రాలేదని, గతంలో తీసుకున్న ఆర్డర్‌ మేరకు నగలను డెలివరీ చేయడానికి తీసుకొచ్చామని వారు వివరించారు.

అయితే ఆభరణాలకు ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో ఘటనపై లోతుగా దర్యాప్తు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఓటర్లకు పంచేందుకే ఈ బంగారాన్ని తీసుకొస్తున్నారా? అన్న కోణంలో విచారించనున్నట్లు తెలిపారు. తిరువారూర్‌ జిల్లాలో రెండు వ్యాన్‌లలో రూ.11 కోట్ల నగదును తరలిస్తుండగా అధికారులు విచారించారు. ప్రైవేటు బ్యాంకుల ఏటీఎంలకు నగదు తీసుకెళ్తున్నట్లు తేలడంతో ఎన్నికల అధికారి అళగర్‌స్వామి తిరిగి ఆ నగదును అప్పగించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.