యాప్నగరం

యువతితో స్వామీజీ పరార్.. తిరుమలలో దొంగ పెళ్లి.. నోరెళ్లబెడుతున్న భక్తజనం

పాదపూజ చేసేందుకు వచ్చిన యువతిని బుట్టలో వేసుకున్న స్వామీజీ శివరాత్రి రోజు ఆమెతో కలిసి పరారయ్యాడు. కొద్దిరోజుల తర్వాత యువతి సోదరుడికి ఫోన్ చేసి ఇద్దరం పెళ్లి చేసుకున్నామని చెప్పాడు.

Samayam Telugu 28 Feb 2020, 9:32 am
భక్తులకు ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ సన్యాని జీవితం గడిపే ఓ స్వామిజీ భక్తులకు ఊహించని షాకిచ్చాడు. రోజూ తన పాదపూజ చేసుకునే 20ఏళ్ల భక్తురాలిపై మనసు పారేసుకుని ఆమెతో కలిసి జంప్ అయ్యాడు. రోజూ స్వామి దర్శనం చేసుకుని ఆయన్ని భగవంతుడి స్వరూపమని భావించే భక్తజనులంతా ఆయనలో రొమాంటిక్ యాంగిల్ కూడా ఉందని తెలిసి అవాక్కవుతున్నారు. వేసుకున్న కాషాయాన్ని మరచి.. అంతరంగంలో భక్తురాలిని నిలుపుకొని స్వామిజీ సాగించిన ప్రేమ వ్యవహారాన్ని గ్రామస్థులు చివరివరకు పసిగట్టలేకపోవడం గమనార్హం. కర్ణాటకలోని కోలారు జిల్లా హోళలి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Samayam Telugu dattatreya avadhoota swamiji eloped with young woman in kolar district karnataka
యువతితో స్వామీజీ పరార్.. తిరుమలలో దొంగ పెళ్లి.. నోరెళ్లబెడుతున్న భక్తజనం


భగవంతుడి స్వరూపుడినని...

ఉత్తర కర్ణాటకలోని విజయపుర జిల్లా ముద్దేబిహాళ్‌కు చెందిన దత్తాత్రేయ అవధూత రెండు నెలల కిందటే హొళలి గ్రామానికి వచ్చాడు. కాషాయం ధరించి.. కమండలం చేతపట్టి.. తన వాగ్దాటితో ప్రజలను ఆకట్టుకున్నాడు. గ్రామంలోని భీమలింగేశ్వర ఆలయంలో పూజారిగా ఉంటానని గ్రామస్థులకు చెప్పి ఒప్పించాడు. తాను భగవంతుడి స్వరూపుడినని, త్వరలోనే అక్కడ ఓ ఆశ్రమాన్ని స్థాపించి గ్రామాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతానని నమ్మించాడు.

​పాదపూజకు వెళ్లిన యువతి​

ఇటీవల మహాశివరాత్రి సందర్భంగా గ్రామంలో జాతరను భారీస్థాయిలో నిర్వహించాడు. దీంతో ప్రజలు తమ గ్రామానికి మంచి స్వామీజీ వచ్చాడని సంబరపడుతున్న సమయంలోనే అందరికీ దిమ్మతిరిగే షాకిచ్చాడు. హోళలి గ్రామానికే చెందిన యువతి శివరాత్రి రోజు స్వామీజీకి పాదపూజ చేసి వస్తానని వెళ్లి ఇంటికి తిరిగిరాలేదు.

యువతితో స్వామీజీ పరార్

ఆందోళన పడిన కుటుంబసభ్యులు ఆమె కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా కనిపించలేదు. అదే సమయంలో స్వామీజీ కూడా కనిపించడం లేదని తెలియడంతో అంతా షాకయ్యారు. స్వామీజీ ఆ యువతిని తీసుకుని వెళ్తుండగా తాము చూశాడని కొందరు స్థానికులు చెప్పడంతో తల్లిదండ్రులతో పాటు, గ్రామస్థులు షాకయ్యారు.

మాయమాటలతో లొంగదీసుకున్న స్వామీజీ

ఆ యువతి రోజూ మఠానికి వచ్చేదని, ఈ క్రమంలోనే స్వామీజీ ఆమెను లోబరుచుకుని వెంట తీసుకెళ్లాడని తెలుసుకున్నారు. దీంతో యువతి తల్లిదండ్రులు స్వామీజీపై కోలారు గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతి సోదరుడు కూడా అదే మఠంలో కొన్నాళ్లుగా స్వామీజీ వద్ద శిష్యరికం చేస్తున్నాడు. రెండ్రోజుల క్రితం అతడికి ఫోన్ చేసి స్వామీజీ ఆమెను తిరుపతిలో పెళ్లి చేసుకున్నానని, రెండు మూడు రోజుల్లో తిరిగొస్తామని చెప్పాడు.

​రంగంలోకి కోలారు జిల్లా ఎస్పీ

భక్తురాలిగా వచ్చే యువతిని లేవదీసుకునిపోయి స్వామీజీ పెళ్లి చేసుకున్నాడని తెలిసి గ్రామస్థులు మరోసారి షాకయ్యారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న కోలార్ జిల్లా ఎస్పీ రంగంలోకి దిగారు. స్వామీజీ ఆచూకీ తెలుసుకునేందుకు స్పెషల్ టీమ్‌లు ఏర్పాటు చేశారు. త్వరలోనే అతడిని పట్టుకుని యువతిని రక్షిస్తామని పోలీసులు చెబుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.