యాప్నగరం

Karnataka Toll Plaza: గేటు తెరవడంలో ఆలస్యం.. టోల్ సిబ్బందిని కొట్టి చంపిన నిందితులు

Karnataka Toll Plaza: కర్ణాటకలో దారుణం జరిగింది. టోల్‌ప్లాజా సిబ్బంది ఒకరిని ఓ మూక కొట్టి చంపింది. టోల్ గేట్‌ తెరవడంలో ఆలస్యం జరిగిందని.. టోల్ సిబ్బందితో వాగ్వాదానికి దిగిన కొంతమంది తర్వాత దాడికి దిగారు. తొలుత స్థానికులు అడ్డుకోవడంతో గొడవ సద్దుమణిగినట్లే కనిపించింది. తర్వాత అక్కడే వేచి ఉన్న నిందితులు సిబ్బందిపై దాడి చేయగా.. ఒకరు చనిపోయారు. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరినట్లు పోలీసులు వెల్లడించారు.

Authored byశివరామచారి తాటికొండ | Samayam Telugu 5 Jun 2023, 7:54 pm
Karnataka Toll Plaza: కర్ణాటకలో ఘోరం చోటుచేసుకుంది. టోల్‌గేట్ తెరవడంలో ఆలస్యం చేశాడని టోల్‌బూత్ సిబ్బంది ఒకరిని కొట్టి చంపారు. రాజధాని బెంగళూరుకు 35 కిలోమీటర్ల దూరంలో రామనగర్ జిల్లాలోని బీదడి వద్ద ఉన్న టోల్‌గేట్‌లో ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. చనిపోయిన వ్యక్తిని 26 ఏళ్ల పవన్ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. అతని సహోద్యోగి మంజునాథ్ కూడా ఈ ఘటనలో తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. మంజునాథ్‌ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
Samayam Telugu Toll Plaza--thumb
సిబ్బందిని కొట్టి చంపిన మూక


కేసు నమోదు
ఈ ఘటనపై బీదడి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితులు బెంగళూరుకు చెందినవారిగా అనుమానిస్తున్నట్లు రామనగర్ ఎస్పీ కార్తిక్ రెడ్డి వెల్లడించారు. ఈ కేసులో దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. రాత్రి 10 గంటల సమయంలో నలుగురు వ్యక్తులు మైసూరు వైపు వెళ్తుండగా.. ఈ ఘటన జరిగిందని వివరించారు. టోల్ ప్లాజా వద్దకు రాగానే టోల్ గేట్ ఎత్తడంలో ఆలస్యం జరిగిందని.. దీంతో నిందితులు టోల్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారని చెప్పారు.

తొలుత అడ్డుకున్న స్థానికులువాగ్వాదం కాస్త తీవ్రంగా మారడంతో స్థానికులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాలు వెళ్లిపోయారు. తర్వాత 4 వ్యక్తులు కారును టోల్ గేట్ నుంచి కొద్ది దూరంలో ఆపారు. ఈ క్రమంలోనే రాత్రి 12 గంటలకు పవన్ కుమార్ తన సహోద్యోగి అయిన మంజునాథ్‌తో కలిసి భోజనం చేసేందుకు వెళ్లారని తెలిపారు. ఆ సమయంలో అక్కడే వేచి ఉన్న నలుగురు నిందితులు దాడికి తెగబడ్డారని వివరించారు. హాకీ స్టిక్స్‌తో ఇద్దరు టోల్ సిబ్బందికి బాగా కొట్టి.. అక్కడి నుంచి పరారయ్యారని తెలిపారు. నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు వెల్లడించారు.
రచయిత గురించి
శివరామచారి తాటికొండ
శివరామచారి తాటికొండ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 4 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.