యాప్నగరం

అడవి దారిలో కాపుకాసి వ్యాపారి హత్య.. గుంటూరులో దారుణం

డబ్బు కోసం హత్యలకు తెగబడుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. కడప జిల్లా ఎర్రగుంట్ల మర్డర్ కేసు మరువక ముందే గుంటూరు జిల్లాలో మరో దారుణం వెలుగుచూసింది.

Samayam Telugu 27 Jun 2020, 5:44 pm
ఇంటి నుంచి బయటికెళ్లిన ఎరువుల వ్యాపారి తిరిగిరాలేదు. కంగారు పడిన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో దారుణం వెలుగుచూసింది. అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమ స్టైల్లో విచారించడంతో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. డబ్బుల కోసం వ్యాపారిని కిరాతకంగా చంపేసి అడవిలో పడేసినట్లు చెప్పడంతో షాక్‌కి గురయ్యారు. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
guntur murder


జిల్లాలోని దుర్గి మండలం కంచరగుంటకి చెందిన పట్టాభి అమరలింగయ్య దుర్గిలో ఎరువుల దుకాణం నడుపుతున్నాడు. ఎనిమిదేళ్లుగా దుర్గిలోనే నివసముంటూ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. గత సోమవారం ఇంటి నుంచి బయటికెళ్లిన అమరలింగయ్య తిరిగిరాలేదు. భర్త ఇంటికి రాకపోవడంతో కంగారుపడిన భార్య బంధువులకు ఫోన్ చేసి ఆరా తీసింది. ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది. తన భర్త కనిపించడం లేదంటూ మిస్సింగ్ కేసు పెట్టింది.

ఎరువుల వ్యాపారి కావడంతో ఆర్థిక లావాదేవీల కారణంగా ఏదైనా మిస్టరీ ఉండొచ్చని అనుమానించి పోలీసులు కేసును సీరియస్‌గా తీసుకున్నారు. వ్యాపారి అదృశ్యానికి వారం రోజుల ముందు డబ్బుల కోసం ఓ వ్యక్తితో గొడవపడినట్లు తెలియడంతో ఆ దిశగా విచారణ చేపట్టారు. అనుమానితులను స్టేషన్‌కి తీసుకొచ్చి తమ స్టైల్లో విచారించడంతో దారుణ హత్య వెలుగులోకి వచ్చింది. వ్యాపారిని డబ్బులిస్తామని నమ్మకంగా తీసుకెళ్లి హత్య చేసి అడవిలో పడేసినట్లు తేలింది.

Also Read: మూడేళ్ల కొడుకు ముక్కుమూసి.. ప్రియుడి మోజులో తల్లి ఘాతుకం.. ప్రకాశంలో దారుణం

అమరలింగయ్యతో గొడవపడిన వ్యక్తి డబ్బులు ఇస్తానంటూ మధ్యవర్తితో రాయబారం పంపారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం వస్తే డబ్బులు ఇస్తానని నమ్మించడంతో మధ్యవర్తితో కలసి బైక్‌పై బయల్దేరాడు. మార్గంమధ్యలో దావుపాడు వద్ద దట్టమైన అటవీ ప్రాంతంలో కాపుకాసి ఉన్న ప్రత్యర్థులు వ్యాపారి అమరలింగయ్యపై దాడి చేసి దారుణంగా హత్య చేశారు. మృతదేహాన్ని అడవిలో పడేసి ఏమీ ఎరగనట్టు చేతులు దులుపుకున్నారు.

పోలీసు విచారణలో హత్య చేసినట్టు తేలడంతో అటవీ ప్రాంతానికి వెళ్లి అమరలింగయ్య మృతదేహాన్ని గుర్తించారు. అప్పటికే నాలుగు రోజులు కావడంతో మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. దీంతో అక్కడే పోస్టుమార్టం జరిపించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. పూర్తి విచారణ అనంతరం నిందితులు, వారికి సహకరించిన మధ్యవర్తి వ్యవహారంపై పోలీసులు స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.

Read Also: నేను చనిపోతున్నా.. కాబోయే భార్యకి యువకుడి షాక్.. ప్రకాశం జిల్లాలో విషాదం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.