యాప్నగరం

కూతురిని పుట్టింటికి పంపలేదని వియ్యంకుడి హత్య.. తెలంగాణలో దారుణం

నిజామాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తన కూతురిని పుట్టింటికి పంపలేదన్న కారణంతో ఓ వ్యక్తి వియ్యంకుడిని కర్రతో కొట్టి దారుణంగా చంపేశాడు.

Samayam Telugu 4 May 2020, 2:53 pm
క్షణికావేశం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కూతురిని పుట్టింటికి పంపించలేదన్న కక్షతో ఓ వ్యక్తి వియ్యంకుడిని కర్రతో కొట్టి దారుణంగా చంపేశాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండలం హాసాకొత్తూర్‌లో చోటుచేసుకుంది. జగిత్యాల జిల్లా కథలాపూర్‌ మండలం దూంపేటకు చెందిన బోదాసు రాజెం తన కుమార్తె నీలాను హాసాకొత్తూర్‌కు చెందిన ఇరగదిండ్ల రాములు కుమారుడు మిరేష్‌‌కిచ్చి కొన్నాళ్ల క్రితం వివాహం చేశాడు.
Samayam Telugu Image


Also Read: ప్రాణం తీసిన గొడవ.. భర్తను గుండెల్లో పొడిచి చంపేసిన మహిళ

శనివారం బోదాసు రాజెం తన కుమార్తెను ఇంటికి తీసుకెళ్లేందుకు హాసాకొత్తూర్‌కు వెళ్లాడు. నీలాను పుట్టింటికి తీసుకెళ్తానని వియ్యంకుడు రాములు, అతడి భార్య రేణుకను కోరాడు. అయితే తమ కొడుకు బయటకు వెళ్లాడని, అతడు వచ్చాక తీసుకెళ్లండని దంపతులు చెప్పారు. వారి మాట పట్టించుకోని బోదాసు రాజెం వారితో గొడవకు దిగాడు. ఇరువర్గాల మధ్య మాటామాట పెరగడంతో ఆగ్రహావేశానికి గురైన బోదాసు రాజెం వియ్యంకుడు రాములును కర్రతో గట్టిగా కొట్టాడు. తలకు బలమైన గాయం కావడంతో రాములు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అదే సమయానికి అక్కడికి చేరుకున్న మిరేష్ తండ్రిని వెంటనే నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం చనిపోయాడు. మిరేష్‌ ఫిర్యాదుతో పోలీసులు బోదాసు రాజెంపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read: హైదరాబాద్ పాతబస్తీలో రెండు వర్గాల ఘర్షణ.. రాళ్లదాడి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.