యాప్నగరం

మహిళకు మధ్యవేలు చూపించినందుకు మూడేళ్ల జైలు!

మహిళకు మధ్యవేలు చూపించి అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి జైల్లో ఊచలు లెక్కపెట్టనున్నాడు. ఈ కేసులో అతడిని దోషిగా నిర్ధారించిన కోర్టు మంగళవారం తీర్పు చెప్పనుంది. నిందితుడికి గరిష్ఠంగా మూడేళ్ల జైలుశిక్ష పడే అవకాశాలున్నాయి.

Samayam Telugu 22 Sep 2019, 3:29 pm
ఎదుటివారిపై కోపాన్ని, అసహ్యాన్ని ప్రదర్శించే సమయంలో కొందరు చేతి మధ్యవేలు చూపిస్తూ ఉంటారు. దీన్ని బూతుగా భావించినప్పటికీ చాలామంది వాడేస్తుంటారు. విదేశాల్లోనూ ఈ పోకడ కొనసాగుతోంది. అయితే ఇకపై మనదేశంలో ఎవరికైనా మధ్యవేలు చూపించాలంటే కాస్త ఆలోచించండి. ఇకపై అలా ఎవరికైనా మధ్యవేలు చూపించారో మీరు జైలుకి వెళ్లక తప్పదు. ఒక్కసారి ఢిల్లీ కోర్టు ఇచ్చిన తీర్పు చూస్తే మీకే అర్థమవుతుంది.
Samayam Telugu 1569051609-Indian_prison


2014లో ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి మరదలితో గొడవపడి మధ్యవేలు చూపిస్తూ అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై ఐపీసీ 509, 323 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు 2015, అక్టోబర్ 8న ఛార్జిషీట్ దాఖలు చేశారు. అప్పటి నుంచి కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. తన మరదలితో ఆస్తి తగాదాలున్నాయని, అందువల్లే తనపై కక్షపూరితంగా కేసు పెట్టిందని నిందితుడు వాదించాడు. అసలు తాను ఆరోజు ఇంట్లో లేనని చెప్పుకొచ్చాడు.

అయితే నిందితుడి వాదనలను పట్టించుకోని న్యాయస్థానం.. అతడు మహిళ మర్యాదకు భంగం కలిగించాడని నిర్ధారించింది. వారిమధ్య ఎలాంటి ఆస్తి తగాదాలు కూడా లేవని తేల్చింది. అతడిని దోషిగా తేల్చిన కోర్టు మంగళవారం(సెప్టెంబర్ 24) తీర్పు ఇవ్వనుంది. అతడికి గరిష్ఠంగా మూడేళ్ల జైలుశిక్ష పడే అవకాశముందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.