తూర్పుగోదావరి జిల్లా మండపేటలో నాలుగేళ్ల బాలుడు జషిత్ కిడ్నాప్ కథ సుఖాంతమైంది. అనపర్తి మండలం కుతుకులూరులోని చింతాలమ్మ గుడి వద్ద గురువారం తెల్లవారుజామున ఒంటరిగా ఏడుస్తూ కనిపించిన బాలుడిని స్థానికంగా ఉండే ఇటుకబట్టీలో పనిచేసే కార్మికులు గమనించారు. బాలుడు చెప్పిన వివరాలతో స్థానికులు జషిత్ తండ్రికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. అతడు పోలీసులకు విషయం చెప్పడంతో అనపర్తి పోలీసులు అక్కడికి చేరుకుని బాలుడిని పోలీస్స్టేషన్కు తరలించారు. అనంతరం జిల్లా ఎస్పీ నయీం అనపర్తి చేరుకుని బాలుడిని స్వాధీనం చేసుకుని మండపేటలోని అతడి తల్లిదండ్రులకు అప్పగించారు.
జషిత్ను చూడగానే అతడి తల్లి ఆనంద భాష్పాలతో అతడిని హత్తుకుంది. తొమ్మిది నెలల నిండు గర్భిణి అయిన జషిత్ తల్లి అతడు కిడ్నాప్ అయినప్పటి నుంచి కన్నీరుమున్నీరవుతూనే ఉన్నారు. ఆమెను ఓదార్చడం ఎవరితరం కాలేదు. కుమారుడు క్షేమంగా రావడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. బాలుడు దొరికాడన్న సమాచారం తెలియడంతో బంధువులు, స్థానికులు జషిత్ ఇంటికి భారీగా చేరుకున్నారు. బాలుడు క్షేమంగా తిరిగిరావడంతో మండపేట వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డ కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి జషిత్ తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలుపుతున్నారు. జషిత్ కోసం తీవ్రంగా శ్రమించిన పోలీసులను స్థానికులు అభినందిస్తున్నారు.
ఎస్పీపై ప్రశంసల జల్లు
బాలుడి కిడ్నాప్ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న చేధించిన జిల్లా ఎస్పీ నయీంపై మండపేట వాసులు ప్రశంసలు కురిపిస్తున్నారు. బాలుడిని తీసుకొచ్చి స్వయంగా తల్లిదండ్రులకు అప్పగించిన ఆయన్ని స్థానికులు పైకెత్తి ఊరేగించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. బాలుడిని క్షేమంగా వదిలేసినంత మాత్రాన కిడ్నాపర్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బాలుడు చెప్పిన వివరాల ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు.
ఇంటికి సమీపంలోనే జషిత్ కిడ్నాప్
శ్రీకాకుళం జిల్లాకు చెందిన నూక వెంకటరమణ, నాగవల్లికి కొన్నాళ్ల క్రితం వివాహమైంది. వీరికి నాలుగేళ్ల కుమారుడు జషిత్ ఉన్నాడు. దంపతులిద్దరూ బ్యాంకు ఉద్యోగులే. బదిలీలో భాగంగా ఏడాది క్రితం మండపేటకు వచ్చిన ఆ కుటుంబం విజయలక్ష్మీ నగర్లోని సాయిధరణి ప్లాజాలో ఫస్ట్ ఫ్లోర్లో నివాసముంటోంది. వీరి కుమారుడు జషిత్ సమీంలోని ఓ కార్పోరేట్ స్కూల్లో ఎల్కేజీ చదువుతున్నాడు.
Also Read: మండపేటలో నాలుగేళ్ల బాలుడి కిడ్నాప్... తెలిసిన వారి పనేనా?
జషిత్ రోజూ స్కూల్ నుంచి వచ్చాక పక్కనే ఉండే గ్రౌండ్లో తోటి పిల్లలతో ఆడుకుంటాడు. సోమవారం కూడా గ్రౌండ్కు వెళ్లిన బాలుడు రాత్రి 7.30 గంటల సమయంలో నాయనమ్మతో కలిసి ఇంటికి తిరిగొస్తున్నాడు. వారిద్దరూ మెట్లు ఎక్కుతుండగా బైక్పై వచ్చిన ఓ గుర్తుతెలియని వ్యక్తి కరెంట్ ఉందా? అని ఆమెను అడిగాడు. లేదని ఆమె చెప్పగానే ముఖంపై కొట్టి బాలుడిని బైక్పై ఎత్తుకుపోయాడు. హఠాత్తుగా జరిగిన ఈ ఘటన నుంచి వృద్ధురాలు తేరుకునేలోగానే దుండుగుడు పిల్లాడితో జంప్ అయ్యాడు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న పిల్లాడు కిడ్నాప్ అయ్యాడని తెలియగానే తల్లి తల్లడిల్లిపోయింది. దీనిపై సమాచారం అందుకున్న రామచంద్రాపురం డీఎస్పీ సంతోష్ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. ఎస్పీ నయీం ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని స్వయంగా పర్యవేక్షించారు. ప్రత్యేక టీమ్లు ఏర్పాటు చేసి కిడ్నాపర్ల కోసం గాలింపు చేపట్టారు. చివరకు పోలీసుల ప్రయత్నం ఫలించి కిడ్నాపర్లు బాలుడిని వదిలిపెట్టారు.