యాప్నగరం

పెళ్లైన 4 నెలలకే నూరేళ్లు నిండిన నవదంపతులు.. శ్రీకాకుళంలో విషాదం

పెళ్లై నాలుగు నెలలు తిరక్కుండానే ఆ నవదంపతులకు నూరేళ్లు నిండిపోయాయి. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. భార్య మరణం తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

Samayam Telugu 14 Oct 2020, 2:45 pm
శ్రీకాకుళం జిల్లాలో అత్యంత విషాద ఘటన చోటుచేసుకుంది. పెళ్లైన నాలుగు నెలలకే నవదంపతులకు నూరేళ్లు నిండిపోయాయి. త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నామన్న ఆనందం కొద్దిరోజులకే ఆవిరైపోయింది. అనారోగ్యంతో భార్య ప్రాణాలు కోల్పోగా.. మరుసటి రోజే భర్త ప్రమాదానికి గురై మృత్యువాతపడ్డాడు. ఇచ్ఛాపురం మండలం కొఠారి గ్రామానికి చెందిన బుడ్డెపు రామారావు, పార్వతిల ఏకైక కొడుకు రాజేష్(28)కి ఇచ్ఛాపురం పట్టణం బెల్లుపడకు చెందిన జయ(26)తో ఈ ఏడాది జూన్ 12న వివాహం జరిగింది.
Samayam Telugu ఇన్‌సెట్‌లో రాజేష్, జయ
death


జయ బెల్లుపడలో వాలంటీర్‌గా పనిచేస్తోంది. నాలుగు నెలలు సంతోషంగా జీవితం గడచిపోయింది. ప్రస్తుతం జయ మూడునెలల గర్భిణి. ఇచ్ఛాపురం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటోంది. అయితే సడెన్‌గా ఆమెకు కడుపులో నొప్పి రావడంతో ఇచ్ఛాపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు ఒడిశాలోని బరంపురం పెద్దాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఫిట్స్ రావడంతో జయ ప్రాణాలు కోల్పోయింది.

Also Read: నానమ్మను చంపేశారని కేసు పెట్టిన మనవడు.. చివరికి షాకింగ్

భార్య హఠాన్మరణాన్ని తట్టుకోలేకపోయిన రాజేష్ మానసికంగా కుంగిపోయాడు. బెల్లుపడలో భార్య అంత్యక్రియలు పూర్తి అయిన తరువాత మరుసటి రోజు ఉదయం కొఠారికి బయల్దేరాడు. ఇచ్చాపురం-ఈదుపురం క్రాస్ రోడ్డు వద్ద రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొని రాజేష్ ప్రాణాలు కోల్పోయాడు. భార్య చనిపోయిందన్న వేదనతో రాజేష్ లారీ కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతున్నారు. కేవలం 24 గంటల వ్యవధిలో నవదంపతుల మరణం చూపరులను కలచివేసింది. రాజేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: రోడ్డుపై పక్కవాడి పొరపాటు ప్రాణం తీసింది.. నెల్లూరులో ఘోరం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.