యాప్నగరం

సికింద్రాబాద్‌లో దారుణం... అర్థరాత్రి విద్యార్థి గొంతుకోసిన సైకోలు

సికింద్రాబాద్‌లో అర్థరాత్రి రోడ్డుపై నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్న విద్యార్థిపై దాడి జరిగింది. ఐదుగురు వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారు. అందులో ఒకడు బ్లేడ్‌తో విద్యార్థి గొంతుకోశాడు.

Samayam Telugu 11 Mar 2020, 8:58 am
జంటనగరాల్లో నేరాల అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా... కొందరు ఏమాత్రం భయం లేకుండా దారుణాలకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా సికింద్రాబాద్‌లో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సైకోల్లా రెచ్చిపోయారు. రోడ్డుపై వెళ్తున్న విద్యార్థిపై అకస్మాత్తుగా దాడికి దిగారు. కర్రలతో తీవ్రంగా దాడికి తెగబడ్డారు. ఆ తర్వాత ఆ గ్యాంగ్‌లో ఒకడు బ్లేడ్ తీసి ఆ విద్యార్థి గొంతుకోశాడు. దీంతో అపస్మారక స్థితిలో రోడ్డుపై ఆ విద్యార్థిని పడేసి అక్కడ్నుంచి పరారయ్యారు. అయితే గాయపడ్డ స్టూడెంట్‌ను చూసిన కొందరు స్థానికులు వెంటనే... సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Samayam Telugu crime


సికింద్రాబాద్ లోని అల్వాల్‌లో జరిగిన ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. రోడ్డుపై నడుచుకుంటూ పదోతరగతి విద్యార్థి ఇంటికి వెళ్తున్న సమయంలో అతనిపై ఐదుగురు వ్యక్తులు దాడికి తెగబడినట్లు తెలుస్తోంది. అతడ్ని కొట్టి పక్కకు తీసుకెళ్లి కర్రలతో చితకబాదారు. అదే గ్యాంగ్‌కి చెందిన మరో వ్యక్తి బ్లేడుతో విద్యార్థి గొంతు కోశాడు. దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో అతడు అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయవడంతో అతడ్ని అక్కడే వదిలి ఆ సైకో గ్యాంగ్ పారిపోయింది. రక్తపు మడుగులో పడివున్న విద్యార్థిని స్థానికులు గుర్తించి వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. కుమారుడి పరిస్థితి చూసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

మొత్తం ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. దాడికి దిగింది ఎవరన్న దానిపై ఆరా తీస్తున్నారు. విద్యార్థికి స్కూల్లో ఏమైనా తగదాలు ఉన్నాయా? లేక కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నాయా? అన్న కోణంలో దర్యప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో ఉన్న సీసీ టీవీ ఫుటేజ్‌లను కూడా పరిశీలిస్తున్నారు. దాడికి తెగబడ్డ వారిని త్వరలోనే పట్టుకుంటామంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.