యాప్నగరం

ఖరీదైన దొంగ.. ప్రియురాలికి గిఫ్ట్‌ల కోసం రిచ్ యువకుడి దొంగ అవతారం

నగరంలో ఆ యువకుడికి నెలకు రూ.3 లక్షలు వరకు అద్దెలు వచ్చే భవనాలు ఉన్నాయి. ప్రియురాలికి తరచూ ఖరీదైన బహుమతులు ఇస్తూ సంతోషపెట్టే అతడు.. డబ్బుల కోసం దొంగగా మారాడు.

Samayam Telugu 26 Apr 2019, 11:24 pm
కోట్లాది రూపాయల విలువ చేసే ఆస్తులకు వారసుడైన ఓ యువకుడు ప్రియురాలి మోజులో పడి దొంగ అవతారమెత్తాడు. ఖరీదైన బహుమతులను ఇచ్చి ఆమెను సంతోష పెట్టడానికి చెడు మార్గాన్ని ఎంచుకున్నాడు. ఇప్పటికే పలు చోరీలు చేసి పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్నాడు. ఆ ఘరానా దొంగను ఎస్సార్ నగర్ పోలీసులు ఎట్టకేళకు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
Samayam Telugu rich
ఖరీదైన దొంగ


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని సుల్తాన్ బజార్‌ బడీచౌడికి చెందిన బల్వీర్‌సింగ్ అలియాస్ బల్లు (25) డిగ్రీ వరకు చదువుకొని దుబారాగా తిరుగుతున్నాడు. అతడి తల్లిదండ్రులకు కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నాయి. నగరంలోని కాచిగూడ ప్రాంతంలో నెలకు రూ.3 లక్షలు వరకు అద్దెలు వచ్చే భవనాలు ఉన్నాయి.

బల్వీర్‌సింగ్‌కు ఓ ప్రియురాలు ఉంది. ఆమె బెంగళూరులో గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ఎంబీఏ చదువుతున్నట్లు సమాచారం. బల్లూ తన ప్రియురాలికి తరచూ ఖరీదైన బహుమతులు ఇస్తూ సంతోష పెడుతుంటాడు. అయితే.. అందుకు అవసరమైన డబ్బుల కోసం దొంగగా మారాడు. ఇంటి తాళాలు పగులగొట్టి గుట్టుగా చోరీలు చేసి పారిపోవడంలో రాటుదేలాడు. పలుమార్లు జైలుకు కూడా వెళ్లి వచ్చినట్లు తెలుస్తోంది.

ఇటీవల బల్కంపేటలోని వేంటటేశ్వర స్వామి ఆలయం వద్ద గల ఓ ఇంట్లో నుంచి 30 తులాల బంగారు ఆభరణాలను చోరీ చేసిన ఘటనలో బల్లూ హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎస్సార్ నగర్ క్రైం పోలీసులు అతణ్ని పట్టుకొని విచారిస్తున్నారు. శనివారం అతడిని మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.