యాప్నగరం

ఉసురు తీసిన లాక్‌డౌన్.. తమిళనాడులో తెలంగాణ జంట ఆత్మహత్య

తెలంగాణలోని ఖమ్మం జిల్లా మంగళగూడెంకు చెందిన గోపీకృష్ణ, నందిని దంపతులు కొన్నాళ్లుగా తమిళనాడులోని కొడైక్కెనాల్‌లో ఉంటున్నారు. లాక్‌డౌన్ కారణంగా ఉపాధి లేక అక్కడే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

Samayam Telugu 9 Aug 2020, 8:21 am
లాక్‌డౌన్‌తో ఉపాధి లేక తెలంగాణకు చెందిన దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన తమిళనాడులోని కొడైక్కెనాల్‌లో జరిగింది. ఖమ్మం జిల్లాలోని మంగళగూడెంకు చెందిన బోజడ్ల గోపీకృష్ణ(27), ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలం చోడవరానికి చెందిన ఏపూరి నందిని(27) కొంతకాలం క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొద్ది నెలలుగా తమిళనాడులోని కొడైక్కెనాల్‌లో నివాసముంటున్నారు. కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు అమల్లోకి తెచ్చిన లాక్‌డౌన్ కారణంగా వారికి కొంతకాలంగా ఉపాధి కరువైంది.
Samayam Telugu నందిని(File Photo)


Also Read: నల్గొండలో రెచ్చిపోయిన దొంగలు.. ఎస్ఐ ఇంట్లో రూ.20లక్షల చోరీ

చేసేందుకు పని లేక, సాయం చేసేవాళ్లు లేక ఆ రాష్ట్రంలో దుర్భర జీవితం అనుభవిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 6న కిరాణా సరకులు సరఫరా చేసే యువకుడు వారింటికి వచ్చి తలుపు తట్టగా వారు తీయలేదు. ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా స్పందించకపోవడంతో పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీసులు వచ్చి పరిశీలించగా గోపీకృష్ణ, నందిని విగతజీవులుగా పడి ఉన్నారు. వారు ఐదో తేదీ రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.

Also Read: భద్రాచలం: ఇంట్లో నిద్రపోతున్న యువతిపై అత్యాచారం

వారింట్లో లభించిన ఆధారాలను బట్టి మంగళగూడెంలోని కుటుంబసభ్యులకు తమిళనాడు పోలీసులు సమాచారం అందించారు. దీంతో మృతుల కుటుంబసభ్యులు శుక్రవారం అక్కడికి చేరుకున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను పోలీసులు అప్పగించడంతో శనివారం మంగళగూడెం తీసుకొచ్చారు. దంపతులిద్దరికీ గ్రామంలోనే ఒకేసారి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది.

Also Read: అమ్మాయిల పిచ్చే ప్రాణం తీసింది.. నెల్లూరు డాక్టర్‌ మృతిపై వీడిన మిస్టరీ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.