ఉత్తర్ప్రదేశ్లో మరో ఘోరం జరిగింది. అదనపు కట్నం ఇవ్వడం లేదన్న అక్కసుతో భార్యను రైలు కిందికి తోసేసి చంపేశాడో కిరాతక భర్త. ఈ ఘటన రాయ్బరేలి పరిధిలోని సీబీ గంజ్ ప్రాంతంలో జరిగింది. రూబీ షా అనే మహిళకు సల్మాన్ అనే వ్యక్తితో ఆర్నెల్ల క్రితం పెళ్లి జరిగింది. అప్పటి నుంచి అదనపు కట్నం తీసుకురావాలంటూ సల్మాన్ భార్యను వేధిస్తున్నాడు.
ఈ ఘటనపై రూబీ షా సోదరుడు రెహ్మాన్ షా స్పందిస్తూ.. సల్మాన్ కుటుంబం తన సోదరిని అదనపు కట్నం కోసం తీవ్రంగా వేధిస్తోందని, చివరకు ప్రాణాలు కూడా తీసేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు. రూబీని ముందస్తు పథకం ప్రకారమే బయటకు తీసుకొచ్చి రైలు కిందకి తోసేశాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సీబీ గంజ్ పోలీసులు సల్మాన్తో పాటు అతడి కుటుంబంపై ఐపీసీ 304బి(వరకట్న హత్య) సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు స్టేషన్ ఆఫీసర్ రాజ్కుమార్ భరద్వాజ్ తెలిపారు. సల్మాన్ను అరెస్ట్ చేశామని, అతడి కుటుంబ సభ్యులను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పేర్కొన్నారు.