యాప్నగరం

Vizag: ఎక్కడికెళ్లినా వీడియోకాల్ చేయమంటున్న భర్త.. భరించలేక భార్య ఆత్మహత్య

జోడుగుళ్లకి చెందిన దేవికి యాతపేటకి చెందిన సురేష్‌తో మూడు నెలల కిందట వివాహమైంది. తల్లిదండ్రులతో కలసి గుడికెళ్లిన భార్యకి ఫోన్ చేసిన సురేష్.. వీడియో కాల్ చేసి ఎక్కడున్నావో చూపించమని అడిగాడు.

Samayam Telugu 13 Sep 2020, 11:27 am
అనుమానపు భర్త వేధింపులు భరించలేక పెళ్లైన మూణ్నెళ్లకే భార్య ఆత్మహత్య చేసుకున్న అత్యంత విషాద ఘటన విశాఖపట్నం జిల్లాలో జరిగింది. ఎక్కడికెళ్లినా వీడియోకాల్ చేయమంటూ భర్త అనుమాన పడుతుండడం తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడింది. జోడుగుళ్లకి చెందిన కోన మల్లేశ్వరరావు, సత్యవతి దంపతుల రెండో కుమార్తె దేవిని పెందుర్తి మండలం యాతపేటకి చెందిన నడిగొట్టి సురేశ్‌కిచ్చి మూడు నెలల కిందట జూన్ 14న పెద్దల సమక్షంలో వివాహం జరిపించారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
suicide


ప్రభుత్వ హాస్టల్‌లో వంటమాస్టర్‌గా పనిచేస్తున్న అల్లుడికి వివాహ సమయంలో భారీగానే కట్నకానుకలు ముట్టజెప్పారు. మూడు లక్షల నగదు, సారె కింద మరో లక్ష, బంగారం కింద రూ.90 వేలు, బైక్ కొనుక్కునేందుకు రూ.50 వేలు కూడా ఇచ్చారు. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉందన్న చందంగా సురేష్ అనుమాన రోగంతో వేధింపులకు దిగాడు. భార్య ఎక్కడికెళ్లినా అనుమానపడుతూ నిత్యం వేధింపులకు గురిచేశాడు. ఎక్కడ ఉన్నా తనకు వీడియో కాల్ చేసి చూపించమంటూ హింసించడంతో దేవి మానసికంగా కుంగిపోయింది.

Also Read: గుండ్రటి హ్యాండ్ రైటింగ్.. వందశాతం జవాబులు.. తీగలాగితే దిమ్మతిరిగే షాక్

నాలుగు రోజుల కిందట తల్లిదండ్రులతో కలసి మోదకొండమ్మ గుడికి వెళ్లింది. ఆ విషయం చెప్పినా అక్కడి నుంచి వీడియో కాల్ చేయమనడంతో ఆమె భరించలేకపోయింది. అనుమానపు భర్త వేధింపులు తట్టుకోలేక దారుణ నిర్ణయం తీసుకుంది. మనస్థాపంతో పుట్టింట్లోనే ఉండిపోయిన దేవి.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పెళ్లై మూడు నెలలు తిరక్కుండానే బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read Also: పెళ్లైన 15 రోజులకే భర్త మృతి.. మెడికో ఆత్మహత్యాయత్నం.. ఖాకీల ఎంట్రీతో షాకింగ్ ట్విస్ట్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.