యాప్నగరం

ప్రెషర్ కుక్కర్‌తో భర్తను చంపేసిన భార్య.. కడపలో దారుణం

రామేశ్వరానికి చెందిన రౌడీషీటర్ నాగేశ్వరరావు మందు తాగొచ్చి భార్యను వేధించేవాడు. కొడుకులను కూడా హింసించి యాసిడ్ పోస్తాననడంతో కట్టుకున్న భార్యే దారుణంగా అంతమొందించింది.

Samayam Telugu 29 May 2020, 3:25 pm
మద్యానికి బానిసైన భర్త నిత్యం వేధింపులకు గురిచేసేవాడు. మందు తాగొచ్చి చీటికీమాటికీ గొడవపడేవాడు. ప్రతిరోజూ వేధింపులు నిత్యకృత్యమయ్యాయి. అయినా ఆ భార్య తలరాత ఇంతే అనుకుంది. కానీ బిడ్డల జోలికొచ్చే సరికి భర్త పాలిట మృత్యుదేవతగా మారింది. మద్యం మత్తులో కొడుకులపై యాసిడ్ పోస్తానంటూ భర్త వీరంగం వేయడంతో ప్రెషర్ కుక్కర్‌తో కొట్టి చంపేసింది. ఈ దారుణ ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


ప్రొద్దుటూరు పట్టణంలోని రామేశ్వరం ప్రాంతానికి చెందిన నాగేశ్వరరావు(45), లక్ష్మీశ్రీదేవి భార్యాభర్తలు. వారికి ఇద్దరు కొడుకులు సుబ్రహ్మణ్యం(21), సాయి(18) సంతానం. నాగేశ్వరరావు సొంత లారీ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మద్యానికి బానిసైన భర్త నిత్యం భార్యని వేధింపులకు గురిచేసేవాడు. మందు తాగొచ్చి భార్యను కొడుతుండేవాడు. రెండు రోజుల కిందట కూడా ఫుల్లుగా తాగొచ్చి భార్యతో గొడవపడ్డాడు.

Also Read:
భార్య ప్రసవం.. భర్త మరణం.. కంటతడి పెట్టిస్తున్న అత్యంత విషాద ఘటన

ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో కొడుకులపై యాసిడ్ పోస్తానంటూ భర్త బెదిరింపులకు దిగాడు. అన్నంత పనీ చేయబోవడంతో భార్య పక్కనే ఉన్న ప్రెషర్ కుక్కర్‌ తీసుకుని భర్త తలపై కొట్టింది. కుక్కర్ మూత తలపై బలంగా తగలడంతో భర్త అక్కడికక్కడే నేలకొరిగాడు. తీవ్రరక్తస్రావమై ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.

హతుడు నాగేశ్వరరావుపై రౌడీషీట్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. హత్యకు ప్రేరేపించిన కారణాలపై ఆరా తీశారు. పోస్టుమార్టం నిమిత్తం డెడ్‌బాడీని ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: కొత్త కోడలిపై కన్నేసిన మామ.. ఒంటరిగా ఉన్న సమయం చూసి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.