యాప్నగరం

ఆటోమేటిక్ డ్రైవింగ్‌‌ టెక్నాలజీని ఇలా కూడా వాడతారా.. అమ్మ బాబోయ్!

Automatic Driving Technology: టెక్నాలజీని సరైన మార్గంలో వాడుకోవాలి. లేకపోతే అనర్థాలు జరుగుతాయి. ఇక రీల్స్ పిచ్చిలో పడి సాహసాలు చేస్తే.. ప్రాణాలకే ప్రమాదం. ఆటోమేటిక్ డ్రైవింగ్ టెక్నాలజీని నలుగురు యువకులు వాడిన తీరు ఇప్పుడు ఇంటర్నెట్‌లో ఆసక్తికర చర్చకు తావిచ్చింది. మహీంద్రా ఎస్‌యూవీ వాహనాన్ని ఏడీఏఎస్ మోడ్‌లో పెట్టి నలుగురు యువకులూ ఆటలో మునిగిపోయారు. కనీస బాధ్యత లేకుండా, డ్రైవింగ్ గాలికొదిలేసి ఇవేం పనులు అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 24 Dec 2022, 10:43 pm
ఎప్పటికప్పుడూ వస్తున్న కొత్త టెక్నాలజీ మనిషి జీవితాన్ని మరింత సరళతరం చేస్తోంది. అయితే, ఆ సాంకేతికతను సరైన దారిలో ఉపయోగిస్తేనే, ఫలితాలు సరిగా ఉంటాయి. లేకపోతే అనర్థాలే మిగులుతాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న ఓ వీడియో ఇప్పుడు ఇలాంటి చర్చకే తావిచ్చింది. ఆ వీడియోలో నలుగురు యువకులు మహీంద్రా XUV 700 వాహనంలో ప్రయాణిస్తున్నారు. ఈ వాహనంలో అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్‌ అసిస్టెంట్‌ సిస్టమ్‌ టెక్నాలజీ ఉంది. ఇది డ్రైవర్‌కు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తుంది. అనుకోకుండా ఏదైనా అడ్డువస్తే వెంటనే డ్రైవర్‌ని అలర్ట్‌ చేస్తుంది. ఈ వాహనంలో ఆటోడ్రైవింగ్‌ మోడ్ కూడా ఉంది.
Samayam Telugu adas
ఆటోడ్రైవింగ్ మోడ్‌లో వాహనం


అయితే, ఈ కారులో ప్రయాణిస్తున్న యువకులు వాహనాన్ని ఆటోడ్రైవింగ్ మోడ్‌లో పెట్టి, స్టీరింగ్‌ వదిలేసి పేకాట ఆడుతున్నట్లు కనిపిస్తోంది. ఎక్కడ జరిగిందో తెలియదు గానీ.. ఇన్‌స్టాలో పోస్టు చేసిన ఈ వీడియో వైరల్ అవుతోంది. నెటిజన్లు దీనిపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

View this post on Instagram A post shared by Shubham Bisherwal (@shubhambisherwal)

‘ADAS (ఆటోడ్రైవింగ్) అనేది ఒక టెక్నాలజీ మాత్రమే. ఒకవేళ అది సరిగా పని చెయ్యకపోతే మీ జీవితాలు ఏమవుతాయో ఆలోచించారా?’ అని ఓ యూజర్‌ కామెంట్‌ పెట్టాడు. ‘ఆటో డ్రైవ్‌ అన్నిసార్లూ పని చెయ్యకపోవచ్చు.. జాగ్రత్త బ్రదర్స్‌..!’ అంటూ మరొకరు కామెంట్ చేశారు.

ఇది నిర్లక్ష్యానికి పరాకాష్ట అంటూ ఎక్కువ మంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఎవరూ సీట్‌ బెల్టు పెట్టుకోలేదు. డ్రైవింగ్‌ గాలికొదిలేశారు. ట్రాఫిక్‌ నిబంధనల గురించి పట్టింపులేదు. వీరిపై కచ్చితంగా చర్యలు తీసుకోవాలి’ అని కామెంట్ చేశారు.

ఇది రీల్ కోసం చేసిన వీడియోలా కనిపిస్తోంది. ‘జస్ట్ ఫర్ ఫన్’ క్యాప్షన్‌తో ఈ వీడియోను పోస్టు చేశారు. వాహనంలో వారు ఆడుతున్నది పేక ముక్కలేనా, ఊరికే డమ్మీ పేక ముక్కలు చేతబట్టుకున్నారా అనే సందేహం కూడా కలుగుతోంది. రీల్స్ పిచ్చిలో పడి నేటి యువత ఏం చేస్తున్నారో వారికే అర్థం కావట్లేదు. ఏదేమైనా రోడ్లపై ఇలాంటి పిచ్చి చర్యలకు పాల్పడకుండా కఠినంగా శిక్షించాల్సిందే.
రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.