యాప్నగరం

బిహార్: 108 గ్రామాలు సంచలన నిర్ణయం.. ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు ప్రకటన

బిహార్ శాసనసభ ఎన్నికల్లో నిరుద్యోగం, కరోనా వైరస్ చుట్టూ ప్రచారం సాగుతోంది. తాము అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మహాఘటబంధన్ మేనిఫేస్టోలో పొందుపరిచారు.

Samayam Telugu 24 Oct 2020, 1:21 pm
రాజకీయ పార్టీల ప్రచారంతో బిహార్ హోరెత్తుతోంది. అటు అధికార కూటమి, ఇటు ప్రతిపక్ష కూటమి హామీలతో ఓటర్లు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇదిలా ఉండగా పోలీసుల దాడికి నిరసనగా ఎన్నికలను బహిష్కరిస్తామని 108 గిరిజన గ్రామాలు తాజాగా ప్రకటించాయి. కైమూర్ ప్రాంతంలో పోలీసులు తప్పుడు కేసులు బనాయించి 25 మంది కైమూర్ ముక్తి మోర్చా కార్యకర్తలను అరెస్టు చేశారు. పోలీసులను ఉపయోగించి అటవీ శాఖ బలవంతంగా దాడులు చేయిస్తున్న నేపథ్యంలో గిరిజన గ్రామాల ప్రజలు అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించారు.
Samayam Telugu బిహార్ ఎన్నికలు


పోలీసుల వైఖరికి నిరసనగానే కైమూర్ ప్రాంతంలోని 108 గిరిజన గ్రామాల ప్రజలు పోలింగును బహిష్కరిస్తారని కైమూర్ ముక్తి మోర్చా ప్రకటించింది. కైమూర్ ప్రాంతంలోని అటవీ ప్రాంతాన్ని రిజర్వ్ ఫారెస్ట్‌గా ప్రకటించడాన్ని అక్కడ గిరిజనులు వ్యతిరేకిస్తూ ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ ఆందోళనలకు కైమూర్ ముక్తి మోర్చా నాయకత్వం వహిస్తోంది. గిరిజన గ్రామాల ప్రజలను బలవంతంగా అక్కడ నుంచి తరలించడాన్ని నిలిపివేయాలని సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.

కైమూర్‌ను షెడ్యూల్డ్ ఏరియాగా ప్రకటించాలని కేఎంఎం డిమాండ్ చేస్తోంది. టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌గా ప్రకటించాలనుకుంటే గ్రామ సభలను నిర్వహించి, గిరిజనుల అభిప్రాయాలను తెలుసుకోవాలని అంటున్నారు. అటవీ హక్కుల చట్టాన్ని అమలుచేయకుండా బిహార్ ప్రభుత్వం క్రిమినల్ చర్యలకు పాల్పడుతోందని దీనిపై ఏర్పాటైన ఓ రాజకీయ కమిటీ నివేదిక మండిపడింది. సెప్టెంబరు 10న 108 గ్రామాలకు చెందిన వేలాది మంది ఆదివాసీలు అధౌరా అటవీ శాఖ కార్యాలయం ముందు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారని పేర్కొంది. విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేసి, ఏడుగురు కార్యకర్తలను అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్టు నివేదిక ఆరోపించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.