యాప్నగరం

విషం కలిపిన స్వీట్లు ఇచ్చి.. రైతు నేతల సంచలన వ్యాఖ్యలు

Delhi: రైతులతో పదకొండో విడత చర్చలు ప్రారంభమయ్యాయి. సమావేశానికి ముందు రైతు సంఘాల నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. చర్చలు ఈసారైనా కొలిక్కి వస్తాయనని దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

Samayam Telugu 22 Jan 2021, 2:34 pm
రైతులపై ఏదో ఒక రకంగా వల విసిరి, విషం కలిపిన స్వీట్లు ఇచ్చి ఆందోళనను విరమింపజేయాలనే తీరుతో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని రైతు సంఘాల నేతలు ఆరోపించారు. వ్యవసాయ చట్టాల రద్దు విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో శుక్రవారం (జనవరి 22) రైతు సంఘాల నేతలతో కేంద్ర మంత్రుల భేటీ ప్రారంభమైంది. ఈ సమావేశానికి ముందు రైతు సంఘాల ప్రతినిధులు చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకుంది.
Samayam Telugu రైతులు
farmers protest


రెండు నెలలుగా ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో చర్చలను ఓ కొలిక్కి తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. నేడు జరుగుతున్నవి పదకొండో విడత చర్చలు. ఈసారైనా చర్చలు ఫలిస్తాయనని రైతులతో పాటు దేశ ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌, పీయూష్‌ గోయల్‌ సమావేశమయ్యారు.

బుధవారం జరిగిన పదో విడత చర్చల్లో వ్యవసాయ చట్టాలను ఏడాదిన్నరపాటు తాత్కాలికంగా నిలుపుదల చేస్తామని కేంద్ర మంత్రులు ప్రతిపాదించిన విషయం తెలిసిందే. చట్టాలపై సంయుక్త కమిటీ వేసి, ఆ కమిటీ నివేదిక ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీనిపై చర్చించుకొని తమ అభిప్రాయం తెలపాల్సిందిగా రైతు సంఘాల నేతలకు సూచించారు.

గురువారం ఢిల్లీ సరిహద్దులోని సింఘూ వద్ద సమావేళమైన రైతు సంఘాల సమన్వయ కమిటీ.. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై చర్చించి, తిరస్కరిస్తూ తీర్మానం చేసింది. మూడు వ్యవసాయ చట్టాల రద్దు తప్ప ఏదీ సమ్మతం కాదని తేల్చి చెప్పారు.

కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని రైతు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. చట్టాలను రద్దు చేయాల్సిందేనని స్పష్టంచేస్తున్నాయి. ఇవాళ పదకొండో విడత భేటీ నేపథ్యంలో ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. కేంద్రం రైతులను ఏదో రకంగా మభ్యపెట్టి ఆందోళన విరమింపజేయాలని చూస్తోందని, వారి ఎత్తులను తిప్పికొడతామని కిసార్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ నేత ఎస్ ఎస్ పందేర్ అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.