యాప్నగరం

Atiq Ahmed అతీఖ్ సోదరుల హత్య: ముగ్గురు యువకులు.. 22 సెకెన్లు.. 14 రౌండ్ల కాల్పులు

Atiq Ahmed బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న గ్యాంగ్‌స్టర్ అతీఖ్ అహ్మద్‌ను గుజరాత్‌లోని జైలు నుంచి ఇటీవలే యూపీకి తీసుకొచ్చారు. ఈ క్రమంలో అతీఖ్ సహా సోదరుడు అష్రఫ్ అహ్మద్‌లను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తీసుకెళ్తుండగా జరిగిన కాల్పుల్లో ఇద్దరూ హతమయ్యారు. దీంతో యూపీలో హైఅలర్ట్ ప్రకటించిన ప్రభుత్వం.. 144 సెక్షన్ విధించింది. ఆస్పత్రి వద్ద మీడియా ప్రతినిధుల ముసుగులో వచ్చిన ముగ్గురు పాయింట్ బ్లాంక్ నుంచి కాల్పులు జరిపారు.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 16 Apr 2023, 11:58 am

ప్రధానాంశాలు:

  • ఉమేశ్ పాల్ హత్య కేసులో నిందితులుగా సోదరులు
  • ప్రయాగ్‌రాజ్‌లోని ఆస్పత్రి వద్ద కాల్పుల ఘటన
  • ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Atiq borthers
ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లో సంచలనం సృష్టించిన ఉమేశ్‌ పాల్‌ (Umesh Pal) హత్య కేసులో నిందితుడిగా ఉన్న గ్యాంగ్‌స్టర్‌ అతీక్‌ అహ్మద్‌ (Atiq Ahmed), అతడి సోదరుడు అష్రాఫ్‌ అహ్మద్‌ (Ashraf Ahmed) శనివారం రాత్రి అనూహ్య రీతిలో హత్యకు గురయ్యారు. వైద్య పరీక్షల కోసం భారీ భద్రత నడుమ ఆస్పత్రికి తీసుకెళ్తోన్న వీరిపై.. జర్నలిస్ట్ ముసుగులో వచ్చిన దుండగులు దగ్గర నుంచి కాల్పులు జరిపారు. పాయింట్ బ్లాంక్‌లో కాల్పులు జరపడంతో సోదరులిద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనలో ఇద్దరు షూటర్లు సహా ముగ్గుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాల్పులకు పాల్పడిన వ్యక్తులను లవ్‌లేశ్ తివారీ, సన్నీ, అరుణ్ మౌర్య‌గా గుర్తించారు. ఈ ఘటనలో ఓ పోలీస్ కానిస్టేబుల్, జర్నలిస్ట్‌కు గాయాలు కాగా.. వారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాల్పుల అనంతరం ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. హత్యలపై విచారణకు ముగ్గురు సభ్యులతో జ్యుడీషియల్ కమిటీ ఏర్పాటుచేయాలని అధికారులకు సూచించారు.

అతీక్ అహ్మద్ సోదరుల హత్యతో యూపీ 144 సెక్షన్ విధించి.. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బృందాలను తరలించారు. ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లాలని ACS (హోమ్), డీజీపీలకు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్‌ ప్రకటించినట్లు ప్రత్యేక డీజీ (లా అండ్‌ ఆర్డర్‌) ప్రశాంత్‌కుమార్‌ తెలిపారు.

శనివారం రాత్రి 10.35 గంటలకు ప్రయాగ్‌రాజ్‌లోని మోతీలాల్ నెహ్రూ ఆస్పత్రికి అతీక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రాఫ్‌లను వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లారు. అక్కడకు చేరుకున్న తర్వాత సోదరులిద్దరూ వాహనం దిగి పోలీసుల భద్రత నడుమ లోపలికి వెళ్తుండగా.. మీడియా ప్రతినిధులు వారిని ప్రశ్నించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో మీడియా ప్రతినిధులతో సోదరులు మాట్లాడుతుండగా అతీక్ ఎడమ పక్కన ఉన్న ఓ యువకుడు పిస్టల్‌తో ఎడమ కణితి, తలపైకి కాల్పులు జరిపాడు.

అనంతరం అష్రఫ్‌ను కూడా మొదట వెనుక నుంచి కాల్చి ఆపై తలపై కాల్చినట్లు సమాచారం. అతను కూడా నేలపై పడిపోయాడు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం 22 సెకెన్లలో 14 రౌండర్లు కాల్పులు జరిపారు. ఇద్దరు షూటర్లు, అతడి సహచరుడ్ని పోలీసులు తక్షణమే అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు చిక్కిన ఇద్దరూ ‘జై శ్రీరామ్’అన్న నినాదాలు చేశారు. ఘటనా స్థలిలో మూడు తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అతిక్, అష్రఫ్‌లను ఆసుపత్రికి తీసుకురావడానికి కనీసం అరగంట ముందు దుండగులు మీడియా ప్రతినిధులతో ఆసుపత్రి వద్ద వేచి ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ముగ్గురు మోటార్‌సైకిళ్లపై ఘటనా స్థలానికి చేరుకుని, ఆ తర్వాత వేచి చూశారు.

Read More Latest National News And Telugu News
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.