యాప్నగరం

‘మనం 15 కోట్ల మందే, కానీ 100 కోట్ల మందిపై..’ ఎంఐఎం నేత వివాదాస్పద వ్యాఖ్యలు

మనం 15 కోట్ల మందిమే ఉన్నాం, కానీ వంద కోట్ల మంది హిందువులను డామినేట్ చేయగలం అని ఏఐఎంఐఎం నేత వారిస్ పఠాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Samayam Telugu 21 Feb 2020, 5:25 pm
ఏఐఎంఐఎం నేత, మహారాష్ట్ర మాజీ ఎమ్మెల్యే వారిస్ పఠాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కలబుర్గిలో నిర్వహించిన సీఏఏ వ్యతిరేక ర్యాలీలో పాల్గొన్న ఆయన.. భారత్‌లో 15 కోట్ల మంది ముస్లింలు మాత్రమే ఉన్నారని.. కానీ 100 కోట్లు ఉన్న హిందువులకు తగిన సమాధానం చెప్పగలరన్నారు. ‘‘అందరం కలిసికట్టుగా పోరాడి స్వేచ్ఛను పొందే సమయం వచ్చింది. గుర్తుంచుకోండి మనం 15 కోట్ల మందిమే ఉన్నాం.. కానీ 100 కోట్ల మందిపై ఆధిపత్యం చెలాయించగలం’’ అని పఠాన్ వ్యాఖ్యానించారు.
Samayam Telugu waris pathan


‘‘మనం మహిళలను ముందు పెట్టాం (సీఏఏ నిరసన ప్రదర్శనల్లో) అంటున్నారు. కేవలం ఆడ సింహాలు బయటకు వస్తేనే మీకు ఇప్పటికే చెమటలు పట్టాయి. మేమంతా కలిసి కట్టుగా వస్తే ఏమవుతుందో మీరు అర్థం చేసుకోగలరు’’ అని పఠాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

మజ్లిస్ నేత వ్యాఖ్యల పట్ల బీజేపీ, కాంగ్రెస్, ఆప్ ఖండించాయి. ‘‘15 కోట్ల మంది ముస్లింలు 100 కోట్ల మంది హిందువులపై ఆధిపత్యం చెలాయించగలరంటున్నావ్ కదా.. దమ్ముంటే ఒక సిక్కుతో నేరుగా తలపడు’’ అని బీజేపీ నేత తజీందర్ పాల్ సింగ్ బగ్గా సవాల్ విసిరారు. ‘తేదీ, సమయం, స్థలం నీ ఇష్టం.. లేదంటే మగతనం లేదని ఒప్పుకో’ అంటూ పఠాన్‌ను ఉద్దేశించి ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

పఠాన్ వ్యాఖ్యల పట్ల బీజేపీ కర్ణాటక విభాగం తీవ్రంగా స్పందించింది. నవభారతంలో ఇలాంటి హెచ్చరికలు పనిచేయవని స్పష్టం చేసింది. మహిళలు, చిన్నారుల వెనుక దాక్కొని లెజెండ్‌లు ఆజాదీని కోరుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

కులం, మతాల వారీగా ప్రజల మధ్య విభజన తెచ్చేలా నేను గానీ మా పార్టీ నేతలు కానీ వ్యవహరించమని పఠాన్ తెలిపారు. తన మాటలను మీడియా వక్రీకరించిందన్నారు. నేను ఎప్పుడూ ఉద్దేశపూర్వకంగా మాట్లాడనని.. నేను భారతీయుడిగా గర్విస్తున్నానని ఆయన చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పబోనని, బీజేపీ తమను విభజించాలని చూస్తోందని ఆయన ఆరోపించారు.

‘భారత్ మాతా కీ’ జై అని నినదించేది లేదని పఠాన్ గతంలో తేల్చి చెప్పారు. దీంతో 2016లో ఆయన్ను మహారాష్ట్ర అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు. మీ పార్టీ వాళ్లు భారత్ మాతా కీ జై అని ఎందుకు అనరని శివసేన ఎమ్మెల్యే గులాబ్ రావ్ పాటిల్ ప్రశ్నించగా.. మేం అలా అనం. జైహింద్ అని మాత్రమే అంటామని పఠాన్ బదులిచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.