యాప్నగరం

మృత్యు మలుపు.. లోయలోకి దూసుకెళ్లిన వాహనం.. 16 మంది దుర్మరణం

జమ్మూ కశ్మీర్లో దోడ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మలుపు వద్ద వాహనం అదుపు తప్పడంతో లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 16 మంది దుర్మరణం చెందారు.

Samayam Telugu 12 Nov 2019, 11:41 pm
జమ్మూకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ వాహనం అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం జరిగిన ఈ ప్రమాదంలో.. ఐదుగురు మహిళలు, ముగ్గురు పిల్లలు కూడా దుర్మరణం చెందారు. దోడ జిల్లాలోని మర్మాత్ ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో.. 12 మంది అక్కడిక్కడే ప్రాణాలు వదిలారు. మరో నలుగురు చికిత్స పొందుతూ చనిపోయారు.
Samayam Telugu kashmir accident


ఈ ఘటనలో ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. తీవ్ర గాయాలపాలైన అతడికి ముందుగా స్థానికంగా ఉన్న హాస్పిటల్‌లో చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం జమ్మూలోని ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించామని దోడా జిల్లా ఎస్పీ ముంతాజ్ అహ్మద్ తెలిపారు. అతడి పరిస్థితి కూడా విషమంగా ఉందన్నారు.

ఈ ఘటనపై జమ్మూకశ్మీర్ అధికార యంత్రాంగం విచారణకు ఆదేశించింది. క్లీనీ నుంచి మర్మాత్‌కు ఎస్‌వీయూ వెళ్తుండగా.. మలుపు వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడని.. దీంతో వాహనం 700 మీటర్ల లోతున్న లోయలోకి పడిపోయిందని అధికారులు చెప్పారు.

ఈ ప్రమాదం పట్ల జమ్మూ డివిజనల్ కమిషనర్ సంజీవ్ వర్మ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని ప్రకటించారు.

Image source: Twitter/ILoveSiliguri

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.