యాప్నగరం

Shinde Sena: షిండే వర్గాన్ని వీడేందుకు సిద్ధమైన 22 మంది ఎమ్మెల్యేలు.. 9 మంది ఎంపీలు?

Shinde Sena దాదాపు ఏడాది కిందట మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. శివసేన పార్టీలో ఏర్పడిన తిరుగుబాటులో ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కూలిపోయింది. షిండే నాయకత్వంలోని రెబల్ ఎమ్మెల్యేలు ఠాక్రేకు ఎదురు తిరిగారు. ఈ నేపథ్యంలో బీజేపీ మద్దతుతో షిండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆయనను బీజేపీ ముఖ్యమంత్రిని చేసింది. అయితే, ఇటీవల మహారాష్ట్రలో జరుగుతున్న పరిణామాలు మరోసారి సంక్షోభం దిశగా సాగుతున్నట్టు కనిపిస్తున్నాయి.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 30 May 2023, 7:40 am

ప్రధానాంశాలు:

  • గతేడాది శివసేన పార్టీలో తలెత్తిన సంక్షోభం
  • షిండే సేనపై ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం నేత వ్యాఖ్యలు
  • బీజేపీపై షిండే వర్గం ఎంపీ బాహటంగా విమర్శలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Uddhav Thackeray
మహారాష్ట్రలో మరోసారి రాజకీయ సంక్షోభం తప్పదా? షిండే వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారా? ఇదే అంశంపై గత కొద్ది రోజులుగా తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉద్ధవ్ వర్గం నేత కీలక వ్యాఖ్యలు చేశారు. ఏక్‌నాథ్ షిండే వర్గంలోని 22 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని, త్వరలోనే వారంతా బయటకు వస్తారని శివసేన (ఉద్ధవ్ వర్గం) ఎంపీ వినాయక్ రౌత్ పేర్కొన్నారు. అలాగే, 13 మంది ఎంపీల్లో 9 మంది తమతో సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన బాంబు పేల్చారు. షిండే సేనలోని ఎంపీలు కూడా తమ పనులు జరగడం లేదని, తమను ధిక్కరిస్తున్నారని కలత చెందారని రౌత్ అన్నారు.
ఎన్‌డీఏ ప్రభుత్వంలో భాగమైనప్పటికీ తమ పట్ల బీజేపీ సవతి తల్లిగా వ్యవహరిస్తోందని షిండే గ్రూపు ఎంపీ గజానన్ కీర్తికర్ అసమ్మతి వ్యక్తం చేసిన కొద్ది రోజులకే రౌత్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. మహారాష్ట్ర మంత్రి శంభురాజే దేశాయ్ 15 రోజుల కిందట ఉద్ధవ్ ఠాక్రేకు ఒక సందేశం పంపారని, వారు ఎలా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారనే దాని గురించి మాట్లాడారని రౌత్ చెప్పారు. కేవలం దేశాయ్ మాత్రమే కాదు తానాజీ సావంత్, గజానన్ కీర్తికర్ తమ అసంతృప్తి వెళ్లగక్కారని గుర్తుచేశారు. షిండే సేన తన మిత్రపక్షమైన బీజేపీ లోక్‌సభ ఎన్నికల ప్రణాళికలపై కలవరపడుతోందని వ్యాఖ్యానించారు.

అయితే, దీనిపై స్పందించిన దేశాయ్.. తాను ఉద్ధవ్‌కు ఎటువంటి మెసేజ్ పెట్టలేదన్నారు. రౌత్ తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రెండు రోజుల్లో క్షమాపణలు చెప్పకుంటే న్యాయపరంగా చర్యలు తీసుకుంటానని మంత్రి హెచ్చరించారు. ‘వినాయక్ రౌత్ వ్యాఖ్యలపై రెండు రోజుల సమయం ఇస్తున్నా.. రౌత్ తన ప్రకటనను ఉపసంహరించుకోకుంటే నేను చట్టపరంగా చర్యలు తీసుకుంటాను.. పరువు నష్టం నోటీసులు పంపుతాను’ అని మంత్రి స్పష్టం చేశారు.

Read More Latest National News And Telugu News
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.